హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పేలుడు పదార్థాల కొరత వల్ల దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి మందకొడిగా సాగుతున్నదని సింగరేణి సంస్థ పేర్కొన్నది. అయినప్పటికీ సింగరేణితో ఒప్పందం చేసుకొన్న ఎన్టీపీసీ, జెన్కో తదితర సంస్థలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని జీఎం కే సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. బొగ్గు సరఫరా పెంచాలన్న ఎన్టీపీసీ ఉన్నతాధికారుల బృందం అభ్యర్థనపై బుధవారం ఆయన సింగరేణి భవన్లో చర్చించారు. సింగరేణితో ఒప్పందం కుదుర్చుకొన్న దాదాపు 20 ప్లాంట్లకు సాధ్యమైనంతమేర అంతరాయం లేకుండా బొగ్గు సరఫరా చేస్తామని, వాటితోపాటు ఎన్టీపీసీ రామగుండం, కుడిగి, షోలాపూర్ ప్లాంట్లకు కూడా కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఒప్పందం మేరకు ఎన్టీపీసీకి 217 లక్షట టన్నుల బొగ్గును సరఫరా చేస్తామన్నారు. రామగుండంలో కొత్తగా ప్రారంభించనున్న రెండు 800 మెగావాట్ల ప్లాంట్లకు కూడా ఏటా 68 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తామని చెప్పారు. త్వరలోనే పేలుడు పదార్థాల సమస్య పరిష్కారం అవుతుందని, అప్పుడు పూర్తిస్థాయిలో బొగ్గు సరఫరా చేస్తామని జీఎం తెలిపారు. సమావేశంలో సింగరేణి ఏజీఎం రాజేశ్వర్రావు, ఎస్వోఎం సురేందర్రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్రెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు లక్ష్మీప్రియ, శ్రీక్రాంతి, ఎన్టీపీసీ జీఎం సాహా, ఏజీఎం షిండే, డీజీఎం లక్ష్మయ్య, సీనియర్ మేనేజర్ సుందర్రాజు తదితరులు పాల్గొన్నారు.