Singapore Telugu Samajam | భారత స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day), సింగపూర్ జాతీయ దినోత్సవం (09-అగష్ట్), పురస్కరించుకుని రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో.. సింగపూర్ తెలుగు సమాజం (Singapore Telugu Samajam) ఆగస్టు 13న సింగపూర్లో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమాలను హెచ్ఎస్ఏ ఔట్రం రోడ్డు, వన్ పుంగోల్లో ఏకకాలంలో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి సింగపూర్లోని తెలుగువారి నుండి అద్భుత స్పందన వచ్చింది. హెచ్ఎస్ఏ ఔట్రం రోడ్డులోని రక్తదాన శిబిరానికి 50 మంది దాతలు రక్తదానం ఇవ్వగా.. వన్ పంగోల్లోని శిబిరానికి 25 మంది దాతలు రక్తదానం ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రత్యేకంగా కుంకు వరలక్ష్మి-నాగేశ్వరరావు అనే దంపతులు ఇద్దరూ రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేస్తే మనం మరింత ఆరోగ్యంగా ఉంటామని అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ బొమ్మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అందరూ రక్తదానం చేయాలని, ఎవరైనా రక్తం కావాలని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా చేసిన అభ్యర్థనలను, షేర్ చేసి తమ సహాయాన్ని అందించాలని ఆయన ప్రోత్సహించారు.
సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నదని, ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంకితభావంతో వరుసగా 9 సార్లు రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ గుర్తు చేశారు.
హెచ్ఎస్ఏ ఔట్రం రోడ్లోని శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్దన రావు ,బోయిని సమ్మయ్య, గాడిపల్లి చంద్ర మౌళి, బద్దం జితేందర్లు సమన్వయకర్తలుగా పనిచేయాగా.. వన్ పుంగోల్లోని శిబిరానికి జ్యోతీశ్వర్ రెడ్డి, పాలేపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస రెడ్డి, బచ్చు ప్రసాద్, టేకూరి నగేష్ మరియు కొత్త సుప్రియ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఇక పెద్ది శేఖర్ రెడ్డి, బైరి రవిల బృందం చాలా ఉత్సాహంగా కార్మిక సోదరులతో కలిసి రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు కార్యక్రమ నిర్వాహకులు జూనెబోయిన అర్జున రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి కృషి వలనే కార్యక్రమం విజయవంతమైనదని తెలిపారు. ఈ సందర్భంగా తమ తదుపరి రక్తదాన కార్యక్రమం 29 అక్టోబర్ 2023 న నిర్వహించబోతున్నామని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.