మెదక్, జనవరి 18 : మెదక్ జిల్ల్లాలోని వనదుర్గా (ఘన పూర్) ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ సానూకుల నిర్ణయం తీసుకోవడంపై రైతులోకం ఆనందం వ్యక్తం చేస్తున్నది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రూ.50.32 కోట్లతో వనదు ర్గా (ఘనపూర్) ప్రాజెక్టు ఆనకట్ట కాల్వల ఆధునీకరణకు పరిపాలనా అనుమతి లభించింది. నిజాం నవాబులు నిర్మించిన వనదుర్గా (ఘనపూర్) ప్రాజెక్టుపై సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. గతంలో నిర్వహణ కొరవడి ఆనకట్ట, రెండు కాల్వల్లో పెద్ద మొత్తంలో పూడిక పేరుకుపోయి, గేట్లు తూముల షెటర్లు దెబ్బతిని రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరందక వేలాది ఎకరాలు బీడుగా మారాయి. ఆయకట్టు 21 వేల ఎకరాలు ఉండగా, 13 వేల ఎకరాలకు మించి సాగు అయ్యే పరిస్థితి లేకుండే. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆనకట్టు ఎత్తు పెంపునకు రూ.43.64 కోట్లు మంజూరు చేసింది.
25 వేల ఎకరాలకు సాగు నీరు..
వనదుర్గా (ఘనపూర్) ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే మహబూబ్నహర్, ఫతేనహర్ కాల్వలు నిండు గా ప్రవహిస్తున్నాయి. దీంతో మెదక్, పాపన్నపేట్, హవేళీఘనపూర్ మండలాల్లో ఆయా కాల్వల పరిధిలోని చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి.
వనదుర్గా (ఘనపూర్) ప్రాజెక్టు ఆనకట్ట కాల్వల వ్యవస్థను గతంలో ఆధునీకరించా రు. అందులో మిగిలిన పోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి పరిపాలన అనుమతులకు ఆమోద ముద్రపడింది.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. ఈ విషయాన్ని మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి వనదుర్గా(ఘనపూర్) ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణకు రూ.50 కోట్ల 37 లక్షలు మంజూరు చేసి, మరోసారి నిరూపించారు. జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. నిజాం కాలంలో నిర్మించిన వనదుర్గా ప్రాజెక్టు, దాని సంబంధిత కాల్వల ద్వారా పాపన్నపేట, మెదక్, హవేళీఘనపూర్, కొల్చారం మండలాల్లో వేల ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం ఉంది. 58ఏండ్ల సమైక్య రాష్ట్ర పాలనలో సాగునీటి రంగంపై చూపిన నిర్లక్ష్యంతో ప్రాజెక్టు కాల్వలు పూడికతో నిండిపోయి, సాగునీరు పారే ఆయకట్టు తగ్గిపోయింది. వనదుర్గా ప్రాజెక్టుకు చెందిన మహబూబ్నహర్ కాల్వ ఆధునీకరణ పనులు గతంలో హవేళీఘనపూర్ మండలం శాలిపేట గ్రామం వరకు జరుగగా, తాజాగా నిధుల మంజూరుతో శాలిపేట నుంచి చివరి ఆయకట్టు వరకు పూర్తి చేస్తారు. దీంతో హవేళీఘనపూర్ మండలంలోని శాలిపేట, బొగుడ భూపతిపూర్, ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, జక్కన్నపేట, సర్ధన, పోచమ్మరాల్ గ్రామాల్లోని వేలాది మంది రైతులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుండడంతో ఆ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వనదుర్గా ప్రాజెక్టుకు చెందిన ఫత్తేనహర్ కాల్వ ఆధునీకరణ పెండింగ్ పనులను చివరి ఆయకట్టు వరకు పూర్తి చేయనున్నారు. దీంతో ఆ ఆయకట్టు గ్రామాలైన పాపన్నపేట మండలానికి చెందిన ఎల్లాపూర్, పొడ్చన్పల్లి, గాంధారిపల్లి, జయపురం, తుమ్మలపల్లి గ్రామాల రైతులకు సాగునీరు సౌకర్యం పెరిగి లబ్ధి చేకూరనున్నది.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
మెదక్ నియోజకవర్గంలో నిజాం కాలంలో నిర్మించిన వనదుర్గా(ఘనపూర్) ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణ పనులను చేపట్టడానికి రూ.50.కోట్ల పరిపాలన అనుమతులను మంత్రి మండలి ఆమోదించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హారీశ్రావుకు కృతజ్ఞతలు. వనదుర్గా(ఘనపూర్) ప్రాజెక్టు కింద సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. 2014లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధతో వెనక్కి వెళ్లిన జైకా నిధులు రూ.25 కోట్లను తిరిగి రప్పించారు. అదనంగా మరో రూ.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా మిగిలిపోయిన పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు మంత్రి వర్గం ఆమోదించింది.