CM KCR | నంగునూరు, నవంబర్ 3: మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ తన ఇష్టదైవమైన కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో తన నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం కోనాయిపల్లిలో ఆడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి, ఏసీపీ సురేందర్రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
వాహనాల పార్కింగ్, సీఎం కేసీఆర్ను చూసేందుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో రానుండడంతో గ్రామంలో భారికేడ్లను ఏర్పాటు చేశారు. పర్యటన ఏర్పాట్లలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య, ఎంపీటీసీ నిమ్మ రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.