చేర్యాల, మార్చి 21 : సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారి బ్రహ్మోత్సవాల పదో వారం సందర్భంగా భక్తులు మల్లన్నను దర్శించుకుని పరవశించి పోయారు. 50 వేల మంది భక్తులు వచ్చినట్లు ఈవో బాలాజీ తెలిపారు. భక్తులు ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండప, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీల్లో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలుగాలని మరికొందరు ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామివారిని వేడుకున్నారు. భక్తులకు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దువ్వల మల్లయ్య, కమిటీ సభ్యులు వజ్రోజు శంకరాచారి, తాళ్లపల్లి శ్రీనివాస్, జాఠోతు స్వప్న, ఆలయ ఏఈవోలు వైరాగ్యం అం జయ్య, గంగా శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.