చెన్నై: సినీనట దంపతులు కమల్ హాసన్, సారిక విడిపోయి చాలాకాలమైంది. ఆ తర్వాత కమల్ గౌతమితో లివిన్ దంపతులుగా గడపడం, వారూ విడిపోవడం తెలిసిందే. కమల్, సారికలకు ఇద్దరు కూతుళ్ల్లు – శ్రుతి, అక్షర. ఇద్దరూ సినిమా రంగంలోకి ప్రవేశించి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తాజాగా కమల్, సారికల కూతురు శ్రుతి హాసన్ అమ్మానాన్నల విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారు విడిపోవడంపై ‘హర్షం’ వ్యక్తం చేసింది. అదేమిటి అంటే గమ్మత్తుగా సమాధానమిచ్చింది. “అమ్మానాన్న విడిపోయినప్పుడు నేను చిన్నదాన్ని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కలిసున్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే వారు సంతోషంగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడనివారు బలవంతంగా కలిసి ఉండడం అంత మంచి విషయం ఏమీ కాదు” అని జూమ్ డిజిటల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి చెప్పింది. వివాహ బంధం నుంచి విడిపోయినా పిల్లలకు మాత్రం చక్కని తల్లిదండ్రులుగా కొనసాగారని వివరించింది. ఇప్పుడు అమ్మా బాగుంది.. నాన్నా బాగున్నాడని పేర్కొన్నది. విడిపోయినా తమతమ ప్రత్యేకతతో సంతోషంగా జీవిస్తున్నారని చెప్పింది. కమల్ మొదటి వివాహం భరతనాట్య నర్తకి వాణీ గణపతితో జరిగింది. పదేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.