చొప్పదండి, మార్చి 12: విద్యుత్తు అధికారుల నిర్వాకం ఓ వినియోగదారుడికి చెమటలు పట్టిం చింది. ఒకే నెలకు రూ.65.35 లక్షల విద్యుత్తు బిల్లు పంపించడంతో బాధితుడు కంగుతిన్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన తిప్పర్తి రత్నాకర్ గోల్డ్ వర్క్షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 10న తన దుకాణానికి వచ్చిన కరెంటు బిల్లులో ఎనర్జీ చార్జీలు రూ.64,96,798, ఫిక్స్డ్ చార్జీలు రూ.120, ఈడీ చార్జీలు రూ.38,985, అడిషనల్ చార్జీలు రూ.150 తో కలిపి రూ.65,35,571 వచ్చింది. దీనికి తోడు వచ్చే నెల 1 లోపు బిల్లు చెల్లించని పక్షంలో మరో రూ.2,831 జరిమానాతో కలిపి రూ.65,38,402 లు చెల్లించాలని సూచించడం గమనార్హం. ఒక నెలలో ఇంత పెద్ద మొత్తంలో బిల్లురావడంతో లబోదిబోమంటున్నాడు. ఈ విషయమై విద్యుత్తు అధికారులను వివరణ కోరగా రీడింగ్ పొరపాటు వల్ల బిల్లు ఎక్కువగా వచ్చిందని, బిల్లు సరిచేసి ఇస్తామనడం గమనార్హం.