న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను పార్లమెంట్ లాబీలోనే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవ్నీత్ కౌర్ రాణా. తనను జైల్లో వేస్తానని కూడా ఆయన బెదిరించినట్లు స్పీకర్కు రాసిన లేఖలో నవ్నీత్ వెల్లడించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలపై ఆమె లోక్సభలో మాట్లాడారు. అప్పటి నుంచీ తనకు బెదిరింపు కాల్స్, శివసేన లెటర్హెడ్ ఉన్న లేఖలు వస్తున్నట్లు ఆమె చెప్పారు.
తనపై యాసిడ్ దాడి చేస్తానని కూడా ఓ లేఖలో బెదిరించినట్లు నవ్నీత్ కౌర్ ఆరోపించారు. శివసేన ఎంపీ అరవింత్ తనను బెదిరించడం తనకే కాదు, దేశ మహిళలందరికీ అవమానమే అని ఆమె స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను జైల్లో వేస్తానని లోక్సభ లాబీలోనే అరవింద్ బెదిరించారు. నా పక్కనే సహచర ఎంపీ ఉన్నారు. ఆయన కూడా అరవింద్ మాటలను విన్నారు అని నవ్నీత్ లేఖలో చెప్పారు. అరవింద్ సావంత్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆమె ఆరోపణలను అరవింద్ ఖండించారు. ఉద్ధవ్ థాక్రే గురించి మాట్లాడితే నీ అందమైన మొహంపై యాసిడ్ పోస్తామని కూడా తనకు బెదిరింపు లేఖలు వచ్చినట్లు నవ్నీత్ వెల్లడించారు.