నాకు 2019 నవంబర్లో పెండ్లయింది. అప్పటినుంచీ అత్తారింట్లో నేను సంతోషంగా గడిపిన రోజంటూ లేదు. నా భర్త, అత్తమామలు అర్ధరాత్రిళ్లు నన్ను ఇంట్లోంచి వెళ్లిపోమని బలవంతపెట్టేవారు. కొన్నినెలల క్రితమే మా ఆయన జర్మనీ వెళ్లారు. ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి మా అమ్మ, అన్నయ్య రాలేదన్న కోపంతో ఆ రోజు రాత్రి మా మామయ్య నన్ను తీవ్రంగా కొట్టారు. జర్మనీకి వెళ్లాక కూడా ఫోన్ చేసిన ప్రతిసారీ నా భర్త నన్ను తిడుతూనే ఉంటారు. క్యారెక్టర్లేని మహిళగా నా మీద ముద్ర వేస్తున్నారు. ఇంట్లో అత్తమామలు, ఫోన్లో భర్త.. మానసికంగా హింసిస్తున్నారు. ఈ భయంకర జీవితం నాకొద్దు. వివాహ బంధం నుంచి బయటికొచ్చి ప్రశాంతంగా జీవించాలని ఉంది. ఇందుకు నేనేం చేయాలో చెప్పండి. అలాగే, నేను ఎవరిపైనా కేసులు పెట్టాలనీ అనుకోవడం లేదు.
–ఓ సోదరి
జ : మీరు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారన్నది మీ మాటల్ని బట్టే అర్థం అవుతున్నది. మీ ముందు మూడు దారులు ఉన్నాయి. ఒకటి.. మీ భర్తను భారతదేశానికి రప్పించి, ఆయనతో కలిసి ఉండాలని మీరు కోరుకుంటే ఆ మేరకు ఓ కేసు పెట్టడం. రెండు.. విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోతే, భర్త నుంచి విడిపోవడానికి ‘జ్యుడీషియల్ సెపరేషన్’ కోసం వ్యాజ్యం నమోదు చేసుకోవడం. అంటే, పెండ్లిని రద్దు చేసుకోకుండానే విడివిడిగా బతకడం. అయితే మీ విషయంలో ఇంకా పిల్లలు లేరు కాబట్టి, విడాకులు తీసుకోవడమే ఉత్తమం. ఈ బంధానికి స్వస్తి పలికి కొత్త జీవితం వైపు అడుగులు వేయడం మేలు. మూడు.. గృహహింస నిరోధక చట్టం -2005 కింద మీ భర్త, అత్తమామల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా మీకు ఉంది.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in