తాండూరు, ఫిబ్రవరి 26: ప్రజల ఆరోగ్యం కోసం తాండూరు వ్యవసాయ పరిశోధన కేం ద్రం నుంచి తాండూరు ‘బ్రాండ్’గా ఆర్గానిక్ కుసుమ నూనెను తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయం తీసుకున్నది. అందుకు తగ్గట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక నూనె తయారీ మిషన్ను తీసుకు వచ్చారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైతుల నుంచి మద్దతు ధరకు కుసుమలు కొనుగోళ్లు చేసి స్వచ్ఛమైన కుసుమ నూనెను వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. రసాయనిక ఎరువులు, మందులు వాడకుం డా పండించిన పంటతో 100 శాతం నాణ్యమైన, కల్తీలేని కుసుమ నూనెను మార్కెటింగ్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బయట మార్కెట్లో అమ్మకాలు జరిపేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండెడ్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ప్రత్యేకంగా లైసెన్స్ కూడా తీసుకున్నారు. 2 జూన్ 2020న సీఎం కేసీఆర్ తాండూరులో తయారు చేస్తున్న కుసుమ నూనె విక్రయాలను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ ఏడాది 10 నుంచి 12 వేల లీటర్ల స్వచ్ఛమైన కుసుమ నూనెను తయారు చేసి అమ్మ కాలు జరిపేందుకు తాండూరు వ్యవసాయ కేంద్రంలో నిత్యం పనులు జరుగుతున్నాయి. తాండూరు వ్యవసాయ కేంద్రంలో పండించిన కుసుమలతో పాటు రైతుల నుంచి నాణ్యమైన ఆర్గానిక్ కుసుమలను సేకరించారు. అందుకు రైతుల నుంచి మద్దతు ధర రేటు కంటే 10 శాతం ఎక్కువ రేటును ఇచ్చి మంచి తెల్లకుసుమలు నిల్వ ఉంచారు. వంద కిలోల కుసుమల నుంచి 20 లీటర్ల నూనె వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం కుసుమ నూనె లీటరు రూ.400 ధరకు అమ్మతున్నట్లు తెలిపారు. వివిధ రకాల మంచి నూనె బయట మార్కెట్లో రూ.160 నుంచి రూ.300 ఉన్నప్పటికీ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తయారు చేస్తున్న నూనె రేటు మాత్రం రూ.400 ఉంది. లాభల కోసం కాకుం డా నాణ్యత, ప్రజల ఆరోగ్యం కోసమేనని శాస్త్రవేత్తలు తెలిపారు.
కుసుమ నూనె తయారీ ప్రక్రియలో పశువుల కోసం దాణా కూడా తయారవుతుంది. కుసుమలను మిషన్లో వేయడంతో అందులోని నూనెతో పాటు పిండి పదార్థం దాణాగా మారుతుంది. ఇది పశువుల ఆరోగ్యానికి చాలా మంచిదని పుశు వైద్యులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గానుగ ద్వారా వచ్చిన పిండి పశువులకు అందించడంతో వాటి ఆరో గ్యం బాగుండడంతో పాటు కండర శక్తి పెరుగుతున్నదని, పాలు ఇచ్చే ఆవులు, గేదెల పాలు చిక్కబడుతాయని రైతులు తెలి పారు. అందుకు రైతుల కోసం నాణ్య మైన దాణాను కూడా వ్యవసాయ కేంద్రంలో అమ్మకానికి ఉంచారు. కిలో దాణాకు రూ.10 చొప్పున 25 కిలోల బస్తాను రూ.250కి అమ్ముతున్నారు. బయట మార్కెట్లో పశువుల దాణా రూ. 25 నుంచి రూ.50కి అమ్ముతుండగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎలాంటి లాభం ఆశించకుండా రైతుల కోసం కిలో రూ.10కే అమ్మడంతో రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కుసుమ నూనెలో మంచి పోషకాలు
కోల్డ్ ప్రెస్డ్ కుసుమ నూనెతో శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయి. బయట మార్కెట్లో అమ్మే నూనె తయారీలో నీళ్లు వేయడం, 175 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో వేడి చేసి గానుగ చేయడంతో నూనెలోని పోషకాలు నశిస్తాయి. తాండూరు ప్రాసెసింగ్ యూనిట్లో తయారు చేసే నూనెను ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తాం. చుక్క నీరు వేయకుండా, అధిక ఉష్ణో గ్రతతో వేడి చేయకుండా నూనె తయారు చేస్తున్నాము. ఒక లీటరు, ఐదు లీటర్ల నూనె డబ్బాలు ప్యాక్ చేసి అమ్మకాలు జరుపుతున్నాం. తాండూరుతో పాటు ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని ప్రధాన కొనుగోళు కేంద్రాల్లో, సూపర్ మార్కెట్లలో తాండూరు మంచి నూనె లభిస్తున్నది. ఈ నూనెతో ఎలాంటి వ్యాధులు దరి చేరవు. గుండె శరీరంలోని కొవ్వును తగ్గించి గుండె జబ్బుల నివారణకు చాల మేలు చేసున్నదిది. రక్త సరఫరా మంచిగా జరుగుతుంది. వెంట్రుకలు పెరగడంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది. విటమిన్ ‘ఇ’ అధికంగా లభిస్తుంది.
– డా.సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం