వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, సాగుకు పుష్కలంగా నీరుండడంతో విత్తన పంటలకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సమైక్య పాలనలో తీవ్ర దుర్భిక్షం నెలకొని పంటలు పండని దుస్థితి. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చాక దేవాదుల ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్ల నిర్మాణంతో సాగునీటి సమస్య తీరింది. దీంతో వానకాలంలో జిల్లాలో లక్షా 15 వేల ఎకరాల్లో వరి సాగైంది. ధాన్యం దిగుబడులు పెరిగిన తరుణంలో కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలకనుగుణంగా యాసంగిలో వరికి బదులు ఆరుతడితోపాటు విత్తన పంటలు సాగుపై రైతులు దృష్టి పెట్టారు. ఈ సీజన్లో మక్కజొన్న, ఆముదం, వేరుశనగ, శనగ పంటలను సుమారు 10 వేల ఎకరాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో కొన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పలు గ్రామాలకు చెందిన రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. దేవరుప్పుల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, జఫర్గఢ్, చిల్పూరు మండలాల్లో బై బ్యాక్ పద్ధతిలో సాగుకు ప్రణాళిక రూపొందించాయి.
-జనగామ, డిసెంబర్ 5(నమస్తేతెలంగాణ)
జనగామ, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు కరువుకు నిలయమైన జిల్లా రైతాంగానికి నేడు సమృద్ధిగా సాగునీరు, ఉచిత విద్యుత్ అందుబాటులోకి రావడంతో వాణిజ్య పంటల వైపు ఉత్సాహం చూపుతున్నారు. నిన్నటి వరకు సంప్రదాయ వ్యవసాయంతో సరిపెట్టుకున్న రైతులు తాజాగా శాస్త్రీయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు కూడా నూతన పద్ధతుల్లో అధిక లాభాలు అందించే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. దుర్బిక్షంగా ఉండే ఈ ప్రాంతంలో నేడు విత్తనాలు పండించి సీడ్ హబ్ జిల్లాగా జనగామను మార్చే దిశగా అడుగులు పతున్నాయి. విత్తనసాగుతో రైతుకు మంచి లాభాలు అందివస్తుండడం, వరికి బదులు ఆరుతడి పంటలతోపాటు వివిధ రకాల విత్తనాలసాగుపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుండడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.
విత్తన, కూరగాయల సాగుకు జిల్లాలోని నేలలు అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తేల్చారు. యాసంగిలో ధాన్యం కొనబోమంటూ కేంద్రం స్పష్టం చేయడంతో ఈ యాసంగిలో 10 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరికి బదులు మక్కజొన్న, ఆముదం, వేరుశనగ, శనగ పంటల సాగుకు రైతులు సిద్ధపడుతున్నారు. పంటల రకాలు, డిమాండ్ను బట్టి కంపెనీలు విత్తన పంటలకు ముందుగానే ధర నిర్ణయిస్తారు. జిల్లాలో గంగా కావేరి, బేయర్, ప్రసాద్ వంటి విత్తన కంపెనీలుండగా, వివిధ గ్రామాల్లో వరి, మక్కజొన్న , విత్తన పంటలకు రైతులతో ఒప్పందం కుదుర్చుకుని సాగు చేస్తున్నాయి.
కొన్ని కంపెనీలు తమ పరిశోధన ప్లాంట్లు ఏర్పాటు చేసి కొత్త వంగడాలపై పరిశోధనలతోపాటు తాము రూపొందించిన వంగడాల డెమో రైతులకు చూపెడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో పక్క రైతులు విత్తన సాగుపై అనుభవం పెంచుకొని సాగుకు ముందుకొస్తున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 10 వేల ఎకరాల్లో వివిధ ప్రైవేట్ కంపెనీల ద్వారా వరి, మక్కజొన్న విత్తన పంటల సాగుకు సిద్ధపడుతున్నాయి. దేవరుప్పుల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, జఫర్గఢ్, చిల్పూరు మండలాల్లో బై బ్యాక్ పద్ధతిలో వెయ్యి ఎకరాల్లో శనగ విత్తన సాగుకు రైతులతో కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటికే సమీప జిల్లాల్లో బై బ్యాక్ విధానంలో సాగు చేసిన పంట కోత దశల్లో ఉంది. జేజీ 11 రకం ఫౌండేషన్ సీడ్ను రైతులకు ఇచ్చేందుకు కంపెనీలు సిద్దపడుతుండగా ఎకరాకు 25 కిలోల విత్తనం కోసం రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు.
సాధారణ రకాలు ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ఈ విత్తనం 8 నుంచి 10 క్వింటాళ్లు వస్తుందని సమీప జిల్లాల్లో సాగుచేసిన రైతుల అనుభవాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న మద్దతు ధర లేదా మార్కెట్ ధరకు సీడ్ విత్తనానికి 20 శాతం అదనంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. మద్ధతు ధరపై క్వింటాలుకు సగటున రూ.900 నుంచి రూ.1100 అదనంగా వస్తుండడంతో రైతులు విత్తనసాగుపై ఆసక్తి చూపుతున్నారు. రెండు క్విం టాళ్లు అధిక దిగుబడితో ఎకరాకు సుమారు రూ.60 వే లు చేతికందే అవకాశమున్నట్లు రైతులు చెబుతుండగా ఎకరాపై రూ.20 వేలు అదనపు ఆదాయం లభిస్తుంది.
శనగ పంట సాగుకు పెట్టుబడి అంతగా ఉండదు. విత్తనం, దుక్కి దున్నకం ఖర్చుతో పాటు కోత, నూర్పిడి ఖర్చు మాత్రమే ఉంటుంది. సాధారణంగా తేమ ఉన్నప్పుడు విత్తనం విత్తితే చలికి పంట పండుతుంది. అధిక దిగుబడుల కోసం ఒకటి రెండు తడులు పెట్టవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.. నల్ల రేగడి భూములకు తడులు పెట్టకున్నా పంట పండుతుంది. విత్తన సమయంలో సీడ్ ట్రీట్మెంట్కు గానూ మంజోజెబ్, కార్బండైజం సరఫరా చేయనున్నారు. శనగకు ఎండుతెగులు బెడద ఉన్నా, అంతగా ప్రభావం చూపదని రైతులు చెబుతున్నారు. పంటకోతకు 10 రోజుల ముందు లీటర్ నీటికి 2 మి.లీ క్వినాల్ఫాస్ మందును పిచికారీ చేస్తే విత్తన నిల్వలో ఆశించే పురుగు బెడద ఉండదు. వరి పక్వదశను గుర్తించి పొడి వాతావరణంలో కోతకోసి విత్తనం 9 శాతం తేమ ఉండేలా ఆరబెట్టి కొత్త సంచుల్లో నింపాలి. భూమికి తగలకుండా సంచులను నిల్వ ఉంచితే విత్తన నాణ్యత బాగా ఉంటుందని పలువురు రైతులు స్పష్టం చేస్తున్నారు.