సికింద్రాబాద్, డిసెంబర్ 10: వీధి వ్యాపారులకు వెసులుబాటు కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని బోర్డు అధికారులకు ఎమ్మెల్యే సాయన్న సూచించారు. శుక్రవారం కంటోన్మెంట్ మూడో వార్డు పరిధిలోని బాలంరాయి కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ప్రాంతంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న పాదయాత్ర నిర్వహించారు. స్థానిక బస్తీవాసులు, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఫెన్సింగ్ ఏర్పాటుతో రోడ్డు కుదించుకపోవడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
ఎన్నో ఏండ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొంతమందికి వ్యాపారం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని చిరు వ్యాపా రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. కంటోన్మెంట్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఉన్న రోడ్లను సైతం కుదించి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని అధికారులకు చురకలు అంటించారు. వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వల్ల జీవనాధారం కోల్పోయే పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.
విద్యార్థులు చదువుకునే పరిసర ప్రాంతాల్లో రోడ్లు చిన్నవి చేయడంతో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిణామాలను తెలుసుకోకుండానే ఇష్టానుసారంగా బోర్డు నిధులను వృథా చేస్తున్నారని, దీనిపై సీఈఓ ప్రత్యేక దృష్టి సారించి, వీధి వ్యాపారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా రూ.5 భోజనానికి కూడా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బోర్డ్డు మాజీ సభ్యులు ప్రభాకర్, సదా కేశవరెడ్డి, నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, నివేదిత, తేజ్పాల్, మురళీయాదవ్ పాల్గొన్నారు.