బన్సీలాల్పేట్, నవంబర్ 12 : చిన్ననాటి నుంచి తనలో ఉన్న ప్రతిభకు ప్రతి ఏటా సృజనాత్మకతను జోడిస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలను దీపావళి బొమ్మల కొలువులో ప్రదర్శిస్తున్నారు దుర్గం విజయ్కుమార్. బన్సీలాల్పేట్ డివిజన్లోని న్యూబోయిగూడకు చెందిన ఆయన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగం చేస్తున్నారు. అందరిలాగా కాకుండా విభిన్నంగా ఉండాలనే తపనతో ఈ సారి దీపావళి బొమ్మల కొలువులో త్వరలో నిర్మించనున్న ‘తెలంగాణ నూతన సచివాలయం’ భవనాన్ని యథావిధిగా థర్మాకోల్తో రూపొందించారు. ఆయన సతీమణి రాజకుమారి తొమ్మిది రోజులపాటు లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నారు. నవంబర్ 4 నుంచి 13వ తేది వరకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, బొమ్మల కొలువును, అందులో రూపొందించిన ప్రత్యేక అంశాన్ని చూసి అభినందనలు తెలుపుతున్నారు.
అద్భుత కళకు ప్రశంసలు..
గత 15 ఏండ్లుగా తాను ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుని, ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే దాని కోసం పనిచేస్తానని విజయ్కుమార్ తెలిపారు. గతంలో చార్మినార్, బిర్లా మందిర్, ట్యాంక్బండ్, తాజ్ మహల్, రామాయణం, శ్రీకృష్ణ జీవిత ఘట్టాలు, ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ బొమ్మల కొలువు జరుపుతున్నారు. ఇది కేవలం బాల్యం నుంచి తనలో ఉన్న కళను ప్రదర్శించాలనే తపన మాత్రమేనని దుర్గం పేర్కొన్నారు. త్వరలో నిర్మించనున్న ‘తెలంగాణ నూతన సచివాలయం’ భవనం కూడా రాష్ర్టానికి మరో తలమానికంగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.