మాక్లూర్, ఫిబ్రవరి 17: నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో కొత్తగా నిర్మించే బిగాల కృష్ణమూర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బిగాల గంగారాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, షకీల్, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలతో కలిసి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పురాతనమైన మాక్లూర్ పాఠశాల భవనాన్ని తొలగించి అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.4.70 కోట్ల ను మంజూరు చేయగా.. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తమ తండ్రి కృష్ణమూర్తి, తాత గంగారాం జ్ఞాపకార్థం రూ.కోటి విరాళంగా అందజేశారని తెలిపారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.కోటి విరాళాన్ని అందజేస్తే పాఠశాలకు వారి పేరు పెట్టుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ నీతూ కిరణ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.