న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సత్యేందర్ జైన్ను సమర్థిస్తూ ఇవాళ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కామెంట్ చేశారు. జైన్ దేశభక్తుడు అని, దేశం ఆయన పట్ల గర్వంగా ఫీలవ్వాలన్నారు. ఢిల్లీకి మొహల్లా క్లినిక్లను పరిచయం చేసింది ఆయనే అన్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రజలందరు వచ్చి ఆ క్లినిక్లను విజిట్ చేస్తున్నట్లు కేజ్రీ అన్నారు. సత్యేందర్కు పద్మ విభూషణ్ ఇవ్వాలని కేజ్రీ సూచించారు. జైన్ను అందరూ దర్యాప్తు చేసిన నష్టం లేదని, సీబీఐ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చిందని, ఈడీ కూడా క్లియరెన్స్ ఇస్తుందని సీఎం కేజ్రీ అన్నారు.
సత్యేందర్ జైన్ను సమర్థిస్తూ కేజ్రీవాల్ చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జైన్ కేసులో కేజ్రీవాల్ జడ్జిలా మారినట్లు ఆమె ఆరోపించారు. మనీల్యాండరింగ్ కేసులో ఉన్న వ్యక్తికి ఎలా క్లీన్ చిట్ ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. 2010 నుంచి 2016 మధ్య సత్యేందర్ జైన్ సుమారు 56 షెల్ కంపెనీల ద్వారా రూ.16.39 కోట్లు ల్యాండరింగ్ చేసింది నిజం కాదా అని అడిగారు. లెక్కల్లో లేని 16 కోట్ల డబ్బు అంకుష్ జైన్, వైభవ్ జైన్లకు చెందదని ఆదాయపన్ను కమిషనర్ చెప్పడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు.
మనీల్యాండరింగ్ అయిన డబ్బుకు సత్యేందర్ జైన్ నిజమైన ఓనర్ అని ఢిల్లీ హైకోర్టు 2019 నాటి తీర్పులో స్పష్టం చేసినట్లు కూడా మంత్రి ఇరానీ తెలిపారు. ప్రయాస్ ఇన్ఫో సొల్యూషన్స్, ఇండో మెటల్ ఇంప్లెక్స్, అకించన్ డెవలపర్స్ షెల్ కంపెనీలతో సత్యేందర్ లబ్ధి పొందడం నిజం కాదా అని, ఆ కంపెనీల షేర్లను జైన్ నియంత్రించడం లేదా అని మంత్రి అడిగారు. ఈ నల్ల డబ్బుతోనే సత్యేందర్ జైన్ ఢిల్లీలో పలు చోట్ల 40 ఎకరాల స్థలం కొన్నట్లు మంత్రి ఆరోపించారు.