క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే.. మంచి మార్పు. ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహంతోనే అది సాధ్యం. భానుడి పరిపూర్ణ కటాక్షానికి ఉత్తరాయణం వేకువ. ఈ ప్రయాణానికి తొలి వేదిక మకర సంక్రాంతి. సంక్రాంతి వేళ పల్లెలు పరవశిస్తాయి, శుభాలు పల్లవిస్తాయి. ఇంటింటా సంక్రాంతి శోభ నర్తిస్తుంది.
సప్తలోక ప్రకాశాయ సప్త సప్తి ధరాయచ
సప్త ద్వీప ప్రకాశాయ భాస్కరాయ నమోనమః
‘అయ గమనే’ అనే ధాతువు ప్రకారం అయనం అంటే గమనం అని అర్థం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తర దిశగా సంచరించే విధానానికి ‘ఉత్తరాయణం’ అని పేరు. నిజానికి సూర్యుడి గమనం అనే పదం వైజ్ఞానికంగా సరైనది కాదు. భూమి సూర్యుడి చుట్టూ సంచరిస్తూ ఉండటమే నిజం. కానీ, భూమి మీద ఉన్న మనకు ఆ విషయం స్పష్టంగా తెలియదు. మన చుట్టూ ఉన్నవే తిరుగుతున్నాయని అనుకుంటాం. భూమి మీద ఉండేవారికి సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపునకు మార్పు చెందుతున్నట్లుగా కనిపించే సందర్భమే ‘ఉత్తరాయణ’ పుణ్యకాలం.
సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించే కాలం ‘దక్షిణాయన సంక్రమణం’ అనీ, మకర రాశిలో సంచరించే కాలాన్ని ‘ఉత్తరాయణ సంక్రమణం’ అని అంటాం. మన ప్రాంతాల్లో సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు ప్రసారమయ్యే కిరణాలు సూక్ష్మజీవి నాశకంగా ఉండవు. అదే సూర్యుడు ఉత్తరం వైపునకు వెళ్తున్నప్పుడు అవే కిరణాలు సూక్ష్మజీవి నాశకాలు అవుతాయి. అందుకే దక్షిణాయన సంక్రమణం అంతా మనకు రోగకారకం అవుతుంటే, ఉత్తరాయణ సంక్రమణ కిరణాలు ఆనంద కారకాలు అవుతున్నాయి. ఈ ఆనందకారకమైన మార్పునకు శ్రీకారం చుట్టే మకర సంక్రమణ దినాన్ని మనం ‘సంక్రాంతి’ ఉత్సవంగా చేసుకుంటున్నాం.
మూడు రోజుల పండుగ
ఆనంద ప్రద సూర్యకిరణ మార్గ సంక్రాంతి మూడు రోజుల ముఖ్యమైన పండుగగా జరుపుకోవడం తెలుగువారి సంప్రదాయం. పండుగ ముందు రోజును ‘భోగి’ శబ్దంతో పిలుస్తాం. భోగభాగ్యాలను ప్రసాదించడమే ‘భోగి’ పండుగ విశేషం. అంతకుముందు సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించినప్పటి నుంచి మకర సంక్రమణం వరకు ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలని భారతీయ ధర్మశాస్త్రం సూచించింది. సూర్యుడు మిథునంలో, ధనుస్సులో సంచరించే కాలంలో ప్రకృతిలో మైథున భావాలు సన్నగిల్లుతాయట. అందుకే, సౌరమాన మిథున, ధనుర్మాసాలకు అనుగుణంగా చాంద్రమానంలో వచ్చే ఆషాఢ, పుష్యాలను శూన్యమాసాలుగా నిర్ణయించారు. ఈ సమయంలో వైవాహిక అనుబంధాలకు దూరంగా, దైవిక కార్యక్రమాలకు చేరువగా ఉండాలని ధర్మశాస్త్రకారులు నిర్ణయించారు. ధనుర్మాసాంతం, మకర ప్రారంభానికి సంకేతంగా మనం ‘భోగి’ పండుగ చేసుకుంటాం.
‘సంక్రాంతికి చలి చంకలెత్తనీయదు’ అని సామెత. చలికాలం కావడం వల్ల భోగి మంటలు వేసుకుంటాం. మనలోని అనవసరమైన కామభావనలన్నీ ఈ కాలంలో పెరగకుండా మండించే విధానమే ఈ భోగిమంటలు. భోగి నాడు పిల్లలకు ఆశీఃపూర్వకంగా భోగిపండ్లు పోయడమూ సంప్రదాయమే. గోదా శ్రీరంగనాథుల కల్యాణం ఈ రోజున మనకు కనిపించే ప్రత్యేకత. అటు దైవికంగా, ఇటు లోకపరంగా భోగి పండుగ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది.
సూర్యుడు నిరయన మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతి పండుగగా చేసుకుంటాం. నిజానికి అయన రహితమైన సాయన మకర రాశి ప్రవేశం డిసెంబర్ 22వ తేదీన జరుగుతుంది. కానీ, పర్వదినాలన్నీ నిరయనానికి సంబంధించి ఉండటం వల్ల మనం నిరయన సంక్రాంతినాడు మాత్రమే ఈ పర్వాన్ని నిర్వహిస్తున్నాం. సూర్యుడికి సంబంధించిన విశేషమైన నమస్కారాలు, పూజలు చేయడం ఈ రోజు ప్రత్యేకత. జరుగబోయే శుభానికి స్వాగతం పలుకుతూ బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాం. రాబోయే ఆరు నెలల కాలంలో శారీరక మానసిక ఉత్తేజంతో అనేక శుభ కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఆనందంగా గడపడానికి శ్రీకారమే ఈ సంక్రాంతి.
తిలా లాభం తలా పిడికెడు..
తిలలు (నువ్వులు) శరీరానికి బాగా వేడిని కలిగించే పదార్థం. నువ్వులతో అనేక రకాలైన పిండివంటలు చేస్తారు. ఆహార పదార్థాల్లోనూ వీటి వినియోగం విరివిగా కనిపిస్తుంది. నువ్వులనూనెతో దైవానికి దీపాలను వెలిగించడం ద్వారా గృహంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వుల నూనెను శరీరానికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే దేహ దారుఢ్యం కలుగుతుంది. శరీరానికి కావల్సిన వేడి అందుతుంది. చలికాలంలో ఇది మరింత విశేషం. స్నాన సమయంలో నీళ్లలో నువ్వులు వేసుకునే సంప్రదాయమూ ఉంది. పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని ‘షట్తిల ఏకాదశి’ అని పిలుస్తారు. ఆనాడు నువ్వులను ఆరు రకాలుగా వినియోగించాలని ధర్మశాస్త్రం తెలియజేసింది. ప్రకృతికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా నువ్వుల వాడకాన్ని విధిగా చేశారు. నువ్వులు శ్రేష్ఠమైనవి కావడం వల్ల పితృ తర్పణాల్లో వాడటం సంప్రదాయం. అయితే, కాలక్రమంలో మన అజ్ఞానం వల్ల నవ్వులను కేవలం పితృ కార్యక్రమాల్లోనే వాడాలని, శని పూజ వాటితోనే చేయాలని మూఢంగా నమ్మడం ప్రబలమైంది. ఈ భావనకు ఎలాంటి ఆధారం లేదు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా నువ్వులను, నువ్వులతో చేసిన తీపి పదార్థాలను వాయనంగా ఇచ్చుకునే సంప్రదాయం ఉంది. నలుగురి క్షేమాన్ని కోరుకుంటూ.. ఈ ధాన్యం చలికాలంలో అందరూ ఉపయోగించాలనేది అంతరార్థం. ఈ కాలంలో శరీర పరమైన అనారోగ్యాలు తొలగి, శుద్ధి ప్రక్రియకు నువ్వులు చాలా దోహదం చేస్తాయి. ఆహారంలో, స్నానంలో, దీపానికి.. ఇలా అనేక రకాలుగా ఈ కాలంలో నువ్వుల వినియోగం పెంచాలి.
మనిషి ఆనందంగా ఉన్నప్పుడే తనలోని దైవత్వం మేల్కొంటుంది. కాబట్టి హరిదాసులకు, గంగిరెద్దుల వారికి, వేర్వేరు వృత్తి జీవనులకు ఉన్నదాంట్లో కొంత పంచి ఆనందాన్ని పెంచుకునే సంప్రదాయం ఈ పండుగలో
కనిపిస్తుంది. బొమ్మల కొలువులు, భోగి పండ్లు మొదలైన ఆనందానుభూతులన్నీ ఈ సందర్భంలో కనిపిస్తున్నవే. ఈ సంక్రాంతి పండుగను శోభాయమానంగా చేసుకుందాం.
మానవ జీవనమంతా ప్రకృతికి, పశుపక్ష్యాదులకు, సమాజానికి నిరంతరం ఉపకరిస్తూనే ఉండాలి. ఈ మూడిటితో కలిసి బతుకుతున్నప్పుడు వాటి క్షేమాన్ని నిరంతరం కోరడం మన ధర్మం. మన పండుగలన్నీ ఈ మూడిటి నిర్వహణ కోసమే ఏర్పడ్డాయి. మనకు వ్యవసాయ జీవనంలో ఉపయోగపడే పశువులకు ధన్యవాదాలను చెప్పుకోవడం, వాటిని సంతృప్తి పరచడం కూడా మానవ జీవన ధర్మమే కదా! సంక్రాంతి తెల్లవారి కనుమ పండుగ సందర్భంగా పశువులకు చేసే పూజలు ఈ రకమైనవే. కనుమ మరుసటి రోజు ముక్కనుమ చేసుకునే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది.
– డా॥ సాగి కమలాకరశర్మ
97042 27744