మనిషిలో ఉండే భేదభావాలు, అస్పృశ్యత వంటి దురాచారాలు వైరస్ లాంటివి. అవి కొవిడ్ కంటే అత్యంత ప్రమాదకరం. బాహ్య ప్రపంచంలో ఉన్న కొవిడ్ను వ్యాక్సిన్తో తగ్గిస్తే, మనసులో ఉండే వైరస్ను అంతా సమానులని రామానుజులు ప్రబోధించిన మార్గం ద్వారా రూపుమాపవచ్చు.
హైదరాబాద్, జనవరి 31 : మనష్యుల మధ్య అంతరాలు సృష్టించే మానసక వైరస్కు వెయ్యేండ్ల కిందటే రామానుజులు టీకాను కనిపెట్టారని చినజీయర్స్వామి శ్లాఘించారు. అందరూ సమానులని చాటిచెప్పిన రామానుజుల సందేశాల ద్వారానే కల్మషం, కులమత భేదాలు, అసమానతలు, సాంఘిక దురాచారాలు దూరమవుతాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో బుధవారం నుంచి ఈ నెల 14 వరకు జరగనున్న రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ, మహాయజ్ఞ కార్యాల విశేషాలను సోమవారం చినజీయర్స్వామి మీడియాకు వివరించారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు, మహాయజ్ఞ కార్యం వెనుక అంతర్, బాహ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. స్వచ్ఛమైన ఆవునెయ్యితో 1,035 కుండాల్లో యజ్ఞం చేయడం వల్ల వాయు కాలుష్యం తగ్గిపోయి కొవిడ్ వంటి వైరస్ల నుంచి పరిహారం లభిస్తుందని, అలాగే సమతామూర్తి సందేశాల ద్వారా మనసులోని వైరస్ (కల్మషం, కులమత భేదాలు, అసమానతలు, సాంఘిక దురాచారాలు) దూరమవుతుందని ఆయన పోల్చి చెప్పారు. మనిషిలో ఉండే భేదభావాలు, అస్పృశ్యత వంటి దురాచారాలను ఆయన వైరస్తో పోల్చుతూ అవి కొవిడ్ కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. బాహ్య ప్రపంచంలో ఉన్న కొవిడ్ను వ్యాక్సిన్తో తగ్గిస్తే, మనసులో ఉండే వైరస్ను అంతా సమానులని రామానుజులు ప్రబోధించిన మార్గం ద్వారా రూపుమాపవచ్చునని వివరించారు. దేశం యావత్తు ఆజాదీకా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటూ త్యాగధనులను తలుచుకుంటున్న తరుణంలో, సమాజంలోని కుళ్లు, అసమానతలను రూపుమాపేందుకు వెయ్యేండ్ల క్రితమే కృషిచేసిన రామానుజాచార్యుడిని తలుచుకుంటూ, వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అంతర్ జబ్బులకు సమతామూర్తి చూపిన మార్గంఅద్భుతమైన మందులా పనిచేస్తుందని అన్నారు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేస్తేనే మనం సుఖంగా ఉంటామని, అదేవిధంగా అన్ని వర్గాలూ సమానత్వంతో జీవించినప్పుడే సమాజం ఉన్నత శిఖరాలవైపు పయనిస్తుందని ఉద్బోధించారు. ఇతరులను గౌరవించే స్వభావం అవసరమని అన్నారు. బలహీనులకు అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతను రామానుజాచార్యులు ఆనాడే చాటిచెప్పారని వివరించారు. ఆనాడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు కృషిచేశారని, పురుష ఆధిపత్యం వేదాల్లో లేదని.. ఆ దిశగానే మహిళలకు ఆయన ప్రత్యేక స్థానాన్ని కల్పించారని చెప్పారు. నేటి సమాజానికి రామానుజుల బోధనలు ఎంతో అవసరమని స్పష్టంచేశారు. వెయ్యేండ్ల సమతామూర్తి పండుగ సందర్భంగా శాస్త్రీయ, వైదిక విధివిధానాలతో యజ్ఞాలు చేయనున్నట్టు వివరించారు. రామానుజులు సందర్శించిన 108 ఆలయాలను (దివ్యదేశాలు) సైతం ఈ ప్రాంతంలో నిర్మించామని పేర్కొన్నా రు. సమాజం అంతా వాస్తవం కాదని, గాలిబుడగతో సమానమని ఆనాడు భావించేవారని, అయితే రామానుజులు ఇది వాస్తవం కాదని చాటిచెప్పారని తెలిపారు.
ప్రతిఒక్కరూ భగవంతుని సంతానమే
వెయ్యేండ్ల క్రితం అస్పృశ్యత దారుణంగా ఉండేదని, దాన్ని రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని చినజీయర్స్వామి చెప్పారు. అస్పృశ్యులను ఆలయాలకు రప్పించిన ఘనత రామానుజాచార్యులకు దక్కిందన్నారు. తమకు ఉన్న నలుగురు పిల్లల్లో ఒకరు వికలాంగులైతే ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ అతని గురించే బాధపడుతూ ఉంటారని, సమాజంలో ఎవరైనా అసమానతలకు, వెనుకబాటుకు గురైతే వారిపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందరూ భగవంతుని సంతానమేనన్న భావన రావాలని ప్రబోధించారు. జాతికన్నా జ్ఞానం గొప్పదని, జ్ఞానంతోనే మనిషికి గుర్తింపు లభిస్తుందని అన్నారు.
16వ శతాబ్దం తరువాత మళ్లీ అసమానతలు
చాలాకాలంపాటు రాజానుజాచార్యుడి మార్గంలో సమాజం నడిచిందని, 16వ శతాబ్దం చివర్లో విదేశీ దండయాత్రల వల్ల మళ్లీ మునపటి పరిస్థితులు దాపురించాయని చినజీయర్స్వామి వివరించారు. మొఘలాయిలు, ఫ్రెంచ్, డచ్చి, ఆంగ్లేయులు దేశంపై దాడిచేసి సమతాభావాన్ని భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు. ఇప్పటి పాలకులు మళ్లీ సమతాభావం వైపు మళ్లడం గొప్ప అదృష్టమని చెప్పారు. మంచికాలం వస్తున్నదని ఆశాభావం వ్యక్తంచేశారు.
నూతన విద్యావిధానంతో మేలు
దేశంలో ప్రవేశపెడుతున్న జాతీయ విద్యా విధానంలో భారతీయ ఆలోచనా ధోరణికి చోటు కల్పించారని చినజీయర్ స్వామి కొనియాడారు. ఆర్యభట్ట వంటి మహానుభావులు చెప్పిన విషయాలపై అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. సమాజంలో విద్యను వ్యాపింపజేసేందుకు రామానుజుడు ఆనాడే కృషిచేశారని వివరించారు. సమాజంలో మార్పు, సమానత్వం కోసం త్యాగాలు చేసిన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్కింగ్, నెల్సన్ మండేలా, మలాలా తదితరులు గురించి కూడా వివరిస్తామని చెప్పారు. వారి చిత్రపటాలను తాకగానే వారి గురించిన విశేషాలు వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
అసమానతలు లేని సమాజం రావాలి
మహిళలు, కులాలు, అంతరాలు, అసమానతలు, హెచ్చుతగ్గులు తదితరాలను రూపుమాపి వాస్తవ పరిస్థితులను నిరూపించేందుకు పోరాడాలని చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. మతం పేరుతో లక్షలమంది వారి జాతులను అంతం చేసుకుంటున్న ధోరణి మారాలని అభిలషించారు. రామానుజులు కులాలు, మతాలు అంతరించి పోవాలని కోరలేదని, వ్యక్తుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏ ధర్మమైనా అనుసరించవచ్చనని పేర్కొన్నారు. మనిషి ఆస్తికుడైనా, నాస్తికుడైనా అతని ఆలోచనా ధోరణి వికాసానికి దోహదపడేదిగా ఉండాలని చెప్పారు.
సమతామూర్తి విగ్రహం ప్రేరణ కావాలి
216 అడుగుల సమతామూర్తి విగ్రహం ఏర్పాటు ద్వారా ఆయన సిద్ధాంతాలు మనుషుల్లో ప్రేరణ కల్పించాలని భావిస్తున్నట్టు చినజీయర్ స్వామి చెప్పారు. డిజిటల్ లైబ్రరీలో రామానుజుడి తొమ్మిది గ్రంథాలను అందుబాటులో ఉంచుతామని, వీటిని ఏ భాషలోనైనా వినేందుకు వీలుగా అత్యాధునిక ట్రాన్స్లేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ దేశంలోని వివిధ ప్రాంతాలే కాకుండా నేపాల్లోని ఆలయాలను పోలిన 108 దివ్యక్షేత్రాల(దివ్యదేశాలు)ను కూడా నిర్మించినట్టు చెప్పారు. ఆయా ఆలయాల్లో నిర్వహించే ఆరాధనా పద్ధతులనే ఇక్కడ కూడా అనుసరిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఒకేచోట 108 ఆలయాలను సందర్శించిన పుణ్యం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.
మానవసేవ మాత్రమే మాధవసేవ కాదు
మానవసేవ మాత్రమే మాధవసేవ కాదని, పర్యావరణంతోపాటు సమస్త ప్రాణికోటిని సంరక్షించుకోవడమే మాధవసేవ అని రామానుజులు బోధించారని చినజీయర్ స్వామి వివరించారు. పర్యావరణాన్ని, ప్రాణులను బలిచేస్తే మొత్తం మావవాళి మనుగడకు ప్రమాదమని హెచ్చరించారు. పర్యావరణం బాగుంటేనే వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి లోక కళ్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు రామానుజాచార్యులు తిరుమల రాయ సముద్రం పేరుతో జలాశయాన్ని నిర్మించారని, ఇది ఇప్పటికీ వేలాది ఎకరాలకు నీటిని అందిస్తున్నదని చెప్పారు.
5న ప్రధాని మోదీ చేతుల మీదుగా సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ
ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ప్రారంభిస్తారని, 13న రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ వస్తున్నారని, రోజుకొక ప్రముఖుడు సందర్శించనున్నారని చినజీయర్ స్వామి తెలిపారు. సుమారు 150 మంది ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. 8,9 తేదీల్లో సాధువులు, సంతులు పాల్గొంటారని పేర్కొన్నారు. 14వ తేదీ తరువాత వీటిని అందరూ సందర్శించవచ్చని చెప్పారు. యాగాలు జరుగుతున్నన్ని రోజులు అందరూ రావొచ్చని, అందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తామని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.
లక్షన్నర కేజీల ఆవు నెయ్యితో లక్ష్మీనారాయణ యాగం
1,035 కుండాల్లో స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో లక్ష్మీనారాయణ యాగం నిర్వహిస్తామని చినజీయర్స్వామి చెప్పారు. ఈ నెయ్యి ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. దీనికోసం 1.5 లక్షల కిలోల నెయ్యిని వినియోగించనున్నట్లు చెప్పారు. దాదాపు 5,000 మంది వేదపండితులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. వేదాలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. శైవ, వైష్ణవ సహా అన్ని సాంప్రదాయాల పండితులు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వస్తున్నారని వెల్లడించారు. తొమ్మిది అంకెకు ఎంతో మహత్యం ఉన్నదని, ఇది నాశనంలేని తత్వాన్ని కలిగి ఉన్నదని చెప్పారు. అందుకే ఇక్కడ ప్రతిదీ తొమ్మిదిపై ఆధారపడి ఉండేలా రూపొందించామని వెల్లడించారు. విగ్రహం 216అడుగులు, దండం 162 అడుగులు, 108మెట్లు.. ఇలా అన్నీ 9 వచ్చేలా ఉంటాయన్నారు.