‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా సినీప్రియులకు చేరువైంది అగ్ర కథానాయిక సమంత. ఆ సిరీస్ అపూర్వ విజయంతో ఈ భామకు హిందీలో కూడా చక్కటి అవకాశాలొస్తున్నట్లు తెలిసింది. తాజాగా సమంత ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో స్పీకర్గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని పొందింది. దక్షిణాది చిత్రసీమ నుంచి ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి నాయికగా సమంత నిలవడం విశేషం. సమంతతో పాటు దర్శకులు అనురాగ్ రాజే, వివేక్ అగ్నిహోత్రి నటుడు జాన్ ఎడతట్టిల్, మనోజ్బాజ్పాయ్ స్పీకర్స్గా పాల్గొనబోతున్నారు. సినిమాల ప్రదర్శన అనంతరం వాటి గురించి విశ్లేషిస్తూ అక్కడి ఆహుతులతో వారు ముచ్చటిస్తారు. ఇదిలావుండగా తాప్సీ స్వీయ నిర్మాణ సంస్థ ద్వారా సమంత హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేయబోతున్నదనే వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తున్నది. గుణశేఖర్ దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. నాని నటిస్తున్న ‘దసరా’ చిత్రంలో కూడా సమంత కీలకమైన అతిథి పాత్రలో కనిపించనుందని సమాచారం. వీటితో పాటు రెండు మహిళా ప్రధాన చిత్రాలకు సమంత అంగీకరించింది. కొద్ది మాసాల్లో అవి సెట్స్మీదకు వెళ్లనున్నాయి.