మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. అగ్ర నాయిక సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్నది. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువారం సమంత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త స్టిల్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత మునికన్యగా కనిపించనుంది.
ఆమె పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ‘అద్భుత ప్రణయగాథ ఇది. గ్రాఫిక్స్ హంగులు కొత్త అనుభూతిని పంచుతాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్, సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాత: నీలిమా గుణ, నిర్మాణ సంస్థలు: డీఆర్పీ-గుణ టీమ్ వర్క్స్, సమర్పణ: దిల్ రాజు, రచన-దర్శకత్వం: గుణశేఖర్.