మాతా, శిశు సంరక్షణకు శ్రమిస్తున్న అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురందించింది. పెంచిన జీతాలను జనవరి నెల నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమైక్య పాలనలో చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తూ నరకయాతన పడిన అంగన్వాడీలు.. స్వరాష్ట్రంలో గౌరవమైన వేతనాన్ని అందుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. అడుగకముందే సీఎం కేసీఆర్ ఏడేండ్లలో మూడు సార్లు వేతనాలు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. 2015 మే నెలలో తొలిసారి అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.4,200 నుంచి రూ.7వేలకు పెంచగా.. 2017 మార్చిలో 10,500కు పెంచారు.
తాజాగా, గత ఆగస్టు నెలలో మూడోసారి 30శాతం అంటే రూ.13,650కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే మినీ అంగన్వాడీలు, ఆయాలకు 2105కు ముందు రూ.2,200 వేతనం ఉండగా, 2015 మే నెలలో రూ.4500, 2017 మార్చిలో రూ.6వేలు, తాజాగా 30 శాతం అంటే రూ.7800కు పెంచారు. ఈ వేతనాలు వచ్చే నెల నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1380 అంగన్వాడీ టీచర్లు, 220 మినీ అంగన్వాడీ టీచర్లు ఉండగా.. 1365 మంది సహాయకులు పని చేస్తున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 969 మంది అంగన్వాడీ టీచర్లు, 138 మంది మినీ అంగన్వాడీ టీచర్లు, 969 మంది సహాయకులు ఉన్నారు. పెరిగిన వేతనాలు అందనుండడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి డిసెంబర్ 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను కూడా పెంచింది. ఇందులో భాగంగా గతంలో చాలా తక్కువ వేతనాలతో జీవనం సాగించిన అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడోసారి వేతనాలను పెంచి అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు తగిన గౌరవమిచ్చింది. 30 శాతం పీఆర్సీని అంగన్వాడీలకు కూడా అమలుచేస్తూ పెంచిన జీతం వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు పెంచిన జీతాన్ని జనవరి నుంచి అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న అంగన్వాడీలకు సముచిత వేతనం అందించేందుకు నిర్ణయించడంతో అంగన్వాడీ టీచర్లతోపాటు సహాయకులు, మినీ అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీల గురించి పట్టించుకోలేదు.
పెంచిన జీతాలు వచ్చే నెల నుంచి అమల్లోకి..
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకుల జీతాలను ఇప్పటికే పెంచుతూ నిర్ణయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, వచ్చే నెల నుంచి నేరుగా అంగన్వాడీ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రధాన అంగన్వాడీ టీచర్ల వేతనాలు రూ.10,500 నుంచి రూ.13650కు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలను రూ.6వేల నుంచి రూ.7,800లకు పెంచింది. 2015కు ముందు అంగన్వాడీల వేతనం రూ.4,200 ఉండగా 2015 మే నెలలో ఒకసారి, 2017 మార్చిలో రెండోసారి, 2021 సెప్టెంబర్లో మూడోసారి అంగన్వాడీ టీచర్ల వేతనాలు ప్రభుత్వం పెంచింది. ఆరేండ్ల కిందటికి, నేటికి వారి వేతనాలు పరిశీలిస్తే అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.9450 పెరిగింది. మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనం 2015లో రూ.2200 ఉండగా ప్రస్తుతం రూ.7800లకు పెంచడంతో రూ.5600 పెరిగింది.
రంగారెడ్డి జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు 1,25,792రంగారెడ్డి జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి మొత్తం 1,25,792 మంది ఉండగా, వీరిలో గర్భిణులు 14897, బాలింతలు 13022, చిన్నారులు(6 నెలల నుంచి ఏడాది) 14777, ఏడాది నుంచి మూడేండ్ల పిల్లలు 52,173 మంది, మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలు 30,923 మంది ఉన్నారు. 1145 మంది అంగన్వాడీ కార్యకర్తలున్నారు.
వికారాబాద్ జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు 67,716వికారాబాద్ జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి మొత్తం 67,716 మంది కాగా.. వీరిలో గర్భిణులు, బాలింతలు 13,011, చిన్నారులు 54,705 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 1600 కేంద్రాలుండగా.. అంగన్వాడీ టీచర్లు 1380, మినీ అంగన్వాడీ టీచర్లు 220, సహాయకులు 1365 మంది వేతన లబ్ధి పొందనున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిధిలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీలుండగా.. అంగన్వాడీ టీచర్లు 969, మినీ అంగన్వాడీలు 138, హెల్పర్లు 969 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 21 అంగన్వాడీ టీచర్లు, 5 మినీ అంగన్వాడీ టీచర్లు, 81 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 2076 మంది వేతన లబ్ధి పొందనున్నారు.
చాలా ఆనందంగా ఉంది
గత ప్రభుత్వాలు అంగన్వాడీలను పట్టించుకోలేదు
ప్రభుత్వ నిర్ణయం బాగుంది
జీతం పెరుగడం సంతోషంగా ఉంది