Sai Durga Tej | టాలీవుడ్లో ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సాయిదుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత కీలక దశలో ఉన్నారు. ‘విరూపాక్ష’ విజయానంతరం కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్న తేజ్, ఇప్పుడు భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటిగట్టు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి రోహిత్ కె.పీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’తో జాతీయ స్థాయిలో విజయాన్ని అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భూమి, సంస్కృతి, పోరాటం ప్రధానాంశాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు కనిపించనున్నారు. సంగీతాన్ని ‘కాంతార’ ఫేమ్ అంజనీష్ లోక్నాథ్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక క్లైమాక్స్ భాగం షూటింగ్ దశలో ఉంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పతాక సన్నివేశాల కోసం దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒక్క క్లైమాక్స్కే ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం తెలుగు చిత్రసీమలో అరుదైన విషయం అని చర్చ జరుగుతోంది. మొత్తం 35 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని, ఇందులో సుమారు 18 భారీ యాక్షన్ బ్లాక్స్ ఉండనున్నట్లు సమాచారం. స్టంట్ కొరియోగ్రాఫర్ కెవిన్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ యుద్ధ ఘట్టాలు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా గ్రాండ్గా చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాకోసం సాయి దుర్గ తేజ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇటీవల విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్లో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్లో కనిపించిన మార్పు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిస్క్తో కూడిన స్టంట్స్ను డూప్ లేకుండా స్వయంగా చేయడానికి తేజ్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఫిజికల్గా, ఎమోషనల్గా ఇది ఆయన కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన పాత్రగా భావిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా మాత్రమే కాకుండా విజువల్ వండర్గా నిలవాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రంతో సాయి దుర్గ తేజ్ మరో సంచలన విజయాన్ని అందుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.