మేడ్చల్, డిసెంబర్28 (నమస్తే తెలంగాణ): యాసంగి పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లోనే మంగళవారం జమ చేసింది. మేడ్చల్ జిల్లాలో మొదటి రోజు 14,555 మంది రైతుల ఖాతాల్లో రూ. 3.70కోట్లు జమ చేశారు. మొదటి విడుతలో ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు రైతుబంధు నగదును జమ చేశారు. ఈ పది రోజుల్లో రైతులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. యాసంగి వ్యవసాయ సాగు పెట్టుబడికి నగదు చేతికి అందడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 42,445 మంది రైతులకు ప్రభుత్వం రైతు బంధు నగదును అందజేస్తుంది. వ్యవసాయ పెట్టుబడికి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతు బంధు ద్వారా ప్రభుత్వం రూ. 39.52 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వ్యవసాయం సాగు కూడా పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులకు వరంగా మారింది. ఏడాదిలో రెండుసార్లు పంట పెట్టుబడికి ఎకరానికి రూ. ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది. అదృష్టంగా భావిస్తున్నాం. అప్పు లేకుండా వ్యవసాయం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు వల్లే ఇది సాధ్యమైంది.- కుంట మల్లేశ్, అలియాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ప్రవేశ పెట్టినప్పటి నుంచి వ్యవసాయం పండుగలా మారింది. అప్పు చేసి వ్యవసాయం సాగు చేయడం ఇబ్బంది కరంగా ఉండేది. రైతు బంధు
ద్వారా నగదు ఇచ్చినప్పటి నుంచి వ్యవసాయం ఇష్టంగా చేస్తున్నాం. సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు. – కావలి చిత్తరి-యాద్గార్పల్లి