సుబేదారి (హనుమకొండ), నవంబర్ 23: ఉద్యోగాల పేరుతో 241 మంది నుంచి రూ.7 కోట్లకు పైగా వసూలు చేసిన కిలాడీ జంటతోపాటు మరో నిందితుడిని వరంగల్ పోలీసులు అరెస్ట్చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోషి సోమవారం వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారానికి చెందిన చల్లా వినయ్పాల్రెడ్డి 2009 నుంచి 2012 వరకు ములుగులో వీఆర్వోగా, ములుగు జిల్లాకు చెందిన పోరిక అనుసూయ ఔట్సోర్సింగ్ పద్ధతిలో అక్కడే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశారు. ఆ సమయంలో వారిమధ్య పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత నకిలీ దస్తావేజులు తయారీ కేసులో ఇద్దరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అనంతరం ఢిల్లీకి చెందిన రాజ్కేపీ సిన్హాతో పరిచయం పెంచుకున్నారు. అతని సాయంతో దర్జాగా కార్లలో తిరుగుతూ విద్యాసంస్థలలో స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ మూడేండ్ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన వందలాది మందినుంచి ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా వసూలు చేశారు. ఇలా 241మంది నుంచి రూ.7 కోట్లు నొక్కేశారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే 41 మందిని వంచించి రెండున్నర కోట్లు వసూలు చేసినట్టు సీపీ తెలిపారు. పలువురు బాధితులు వరంగల్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.21.70 లక్షలు, రెండు కార్లు, నకిలీ ఐడీకార్డులు, అర్డర్కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.