కొండాపూర్, నవంబర్ 25 : ఎన్నో కలలు..ఆశయాలతో ఒక్కటైన జంటను విధి చిన్నచూపు చూసింది.. పెండ్లయిన మూడు రోజులకే.. మూడు ముళ్ల బంధం విషాదాంతమైంది. చెన్నై సమీపంలోని కందికుప్పం పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వధువు చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.
21న వివాహమైంది.. : శేరిలింగంపల్లి నేతాజీనగర్కు చెందిన అన్నపూర్ణ, మురళీకృష్ణల కుమారుడు శ్రీనివాసులు చెన్నైకి చెందిన కనిమొళిని నవంబర్ 21న తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. అనంతరం నవ దంపతులిద్దరూ కలిసి సోమవారం కారులో చెన్నై బయలుదేరారు. అర్ధరాత్రి కృష్ణగిరి ప్రభుత్వ దవాఖాన సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీనివాసులు ఘటనాస్థలిలోనే మృత్యువాతపడ్డాడు. తీవ్రంగా గాయపడిన కనిమొళి చికిత్స పొందుతూ కన్నుమూసింది. వధూవరులిద్దరూ చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.