‘నిర్మాత చినబాబును నవ్వించడం చాలా కష్టం. నా సంభాషణలు చక్కటి వినోదాన్ని పంచాయని ఆయనే మెచ్చుకున్నారు. ఈ సినిమాకు నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే’ అని అన్నారు గణేష్ రావూరి. ఆయన డైలాగ్స్ను అందించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో గణేష్ రావూరి పాత్రికేయులతో ముచ్చటించారు.
ఆ విశేషాలివి..
రచయితను కావాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా రివ్యూ రైటర్గా మారాను. లవ్లీ, సరదా, సోలో బ్రతుకే సో బెటర్తో పాటు కొన్ని సినిమాలకు రచనా విభాగంలో పనిచేశా. పూర్తిస్థాయి సంభాషణల రచయితగా నేను పనిచేసిన తొలి సినిమా ఇది. లక్ష్మీసౌజన్య సిద్ధం చేసిన కథకు మంచి మాటలు కావాలనే ఆలోచనతో నిర్మాత చినబాబు నన్ను సంప్రదించారు. కొత్త పంథాలో నేను రాసిన డైలాగ్స్ నచ్చడంతో అవకాశమిచ్చారు. ఈ కథలో అమ్మాయి రెండు సార్లు ప్రేమలో పడటం అనే పాయింట్ నచ్చింది. చక్కటి భావోద్వేగాలతో ముడిపడిన కథ కావడంతో సంభాషణలు బాగా రాయడానికి ఆస్కారం దక్కింది. ఇందులో ప్రతి పాత్రకు కొన్ని హద్దులు ఉంటాయి. మనసులో ఒకటి దాచుకొని పైకి మాత్రం మరోలా ప్రవర్తిస్తుంటాయి. ఆ ఎమోషన్స్ను చూపిస్తూ హద్దులు దాటకుండా సంభాషణలు రాయడం ఛాలెంజింగ్గా అనిపించింది.
త్రివిక్రమ్ స్ఫూర్తి
రచయితగా త్రివిక్రమ్ నాకు స్ఫూర్తి. ఈ సినిమాలోని సంభాషణలు ఆయన శైలిని గుర్తుతెస్తున్నాయని అంటున్నారు. అయితే త్రివిక్రమ్గారిని అనుకరించకుండా నాదైన శైలిలో డైలాగ్స్ రాశాను. ఈ సినిమా చూసి త్రివిక్రమ్ ఎన్ని మార్పులు చెబుతారోనని భయపడ్డాం. కానీ రెండు చిన్న సన్నివేశాలు మాత్రమే మార్చారు. అదే నేను పెద్ద సక్సెస్గా భావిస్తున్నా. ప్రతి డైలాగ్ను క్లుప్తంగా చిన్న చిన్న మాటల్లో చెప్పడానికే ప్రయత్నించా. ఈ సినిమాకు సంభాషణలు అందించడంతో పాటు స్క్రీన్ప్లే రైటర్గా కూడా పనిచేశా.
దర్శకత్వం చేస్తా
దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. కానీ పూర్తిస్థాయిలో ఆ విభాగంపై అవగాహన వచ్చే వరకు రచయితగానే కొనసాగుతాను. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నా. కామెడీ, ఎమోషన్స్తో పాటు యాక్షన్, మాస్ ఎలివేషన్ సీన్స్కు డైలాగ్స్ రాయడం ఇష్టం.