అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు భారీ కుంభకోణాలను మహానాడు తరువాత బయటపెడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టానని అన్నారు. వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిన వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదని విస్తృతంగా చర్చిస్తున్నామని తెలిపారు.
ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని వివరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశానని ఈసారి తప్పుకుని మరొకరికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. రెండు సార్లు ఒకే పదవిలో ఉన్నవారికి విరామం ఇవ్వాలని అన్నారు. ఏపీలోని ముప్పై నియోజకవర్గంలో సరైన టీడీపీ అభ్యర్థులను నియమించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని తెలిపారు.