కాట్మాండు: నేపాల్లో త్రిశూలీ 3ఏ హైడ్రోపవర్ టన్నెల్ నుంచి ఇవాళ ఇద్దర్ని సురక్షితంగా బయటకు తీసిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 26వ తేదీన వచ్చిన వరదలు.. బోటెకోసి నది మార్గంలో ఉన్న అన్ని హైడ్రోపవర్ కేంద్రాలను పూడ్చివేశాయి. సుమారు 12 పవర్ ప్లాంట్లు భూగర్భంలో కలిసిపోయాయి. నేపాల్ ప్రభుత్వం ప్రకారం సుమారు 900 మంది కార్మికులు వివిధ టన్నెల్స్లో చిక్కుకున్నట్లు తెలిసింది. అయితే ఇంటర్నేషనల్ టన్నెల్లింగ్ అండ్ అండర్గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్నాల్డ్ డిక్స్ సూచనల ప్రకారం ప్రస్తుతం నేపాల్ టన్నెల్స్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎలా రెస్క్యూ నిర్వహించాలన్న అంశాలను అర్నాల్డ్ డిక్స్ నేపాల్ సర్కారుకు వివరిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేదని, ఎందుకంటే టన్నెల్ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో తెలియకుండాపోయిందని ఆయన అన్నారు. ఒకప్పుడు పైన ఉన్న టన్నెల్ ఎంట్రెన్స్, ఇప్పుడు భూగర్భంలోకి మారిందన్నాడు. దీన్ని బట్టి ఆ కొండచరియలు ఎంత భీకరంగా ఉండి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు. ఆ భయంకర వరద ధాటికి ఎంట్రెన్స్ మొత్తం కూలిందన్నారు.

అయితే శాటిలైట్ డేటా ఆధారంగా రెస్క్యూ చేపట్టాల్సిన ప్రాంతాన్ని గుర్తించారు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎంట్రెన్స్ ప్రాంతాన్ని పసికట్టినట్లు చెప్పారు. ఇక ఆ టన్నెల్లో ప్రాణాలతో ఉన్నవారిని.. ఎక్కడున్నారో గుర్తించడం మరో కీలక అంశంగా మారిందన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి, టెక్నాలజీతో అంచనా వేస్తున్నట్లు డిక్స్ తెలిపారు. బురద, బండ రాళ్లతో నిండిపోయిన టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కొన్ని చోట్ల కార్ల కన్నా పెద్ద సైజులో బండరాళ్లు ఉన్నాయన్నారు.
భారీ రాళ్లను డైనమేట్లతో పేల్చుతున్నారు. వాస్తవానికి పేల్చడం పద్ధతి కాదు, కాని ఇక్కడున్న శిథిలాల తొలగింపు మరోలా సాధ్యం కాదన్నారు. బండరాళ్లను తొలగించడం వల్ల ఇద్దర్నీ గుర్తించామని డిక్స్ తెలిపారు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క మిరాకిల్ ఉన్నట్లు చెప్పారు. త్రిశూలీ టన్నెల్లో ఇప్పటికే వరకు 60 మీటర్ల దూరాన్ని సెర్చ్ చేశారు. ఇంకా సుమారు 150 మీటర్ల దూరం ఆ టన్నెల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాల్సి ఉందని డిక్స్ చెప్పారు.

టన్నెల్ చివరలో గోల్డీలాక్స్ జోన్ ఉంటుందని, అక్కడే ఎక్కువ మంది సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. హైడ్రోపవర్ స్టేషన్లో గోల్డీలాక్స్ జోన్ కొంత ఎత్తులో ఉంటుందని, అక్కడ కొంత స్థలం ఫ్రీగా ఉండడం వల్ల, కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. నేపాల్, టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 1301కి చేరింది. 5339 మంది మిస్సింగ్లో ఉన్నారు. టన్నెల్లో ఇవాళ ఇద్దర్ని రక్షించగా, ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.