హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం)కి ఎంపికైన విద్యార్థుల జాబితా గురువారం విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,404 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లా నుంచి వంద మంది విద్యార్థులకు ఎంపికయ్యారు. ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా ఐదుగురు విద్యార్థులు ఆర్జీయూకేటీలో సీట్లు సాధించారు. ఈ నెల ప్రారంభంలో ఆర్జీయూకేటీలో ప్రవేశానికి యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియను పదో తరగతిలో సాధించిన ఫలితాల (జీపీఏ) ఆధారంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది మాత్రం పాలిసెట్ పరీక్షలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకున్నారు. గతేడాది 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా.. ఈ సారి సంఖ్యను కాస్త కుదించారు. సీట్ల కేటాయింపులో స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ ఉండగా.. మిగతా 15 శాతం సీట్లను మిగతా వారికి కేటాయిస్తున్నారు.