Red Fort : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) లో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువైన రెండు బంగారు కలశాలు (Gold Kalash) చోరీకి గురయ్యాయి. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 3న ఉదయం ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ తీసుకొచ్చిన బంగారు కలశాలు కనిపించకుండా పోయాయి.
పూజ కోసం తాను తీసుకువచ్చిన 760 గ్రాములు బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం పూజ అనంతరం కనిపించలేదని సుధీర్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదుచేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవ్వడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే ఈ దొంగతనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎర్రకోట నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి, రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. చోరీ అనంతరం అతడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.