ముంబై, నవంబర్ 29: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డు రద్దయింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థ.. రుణదాతలకు వివిధ చెల్లింపులను చేయలేకపోతున్నది. ఈ క్రమంలోనే సంస్థ బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం రద్దు చేసింది. ప్రస్తుతమున్న బోర్డు.. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఏ రకంగానూ పరిష్కరించేలా లేదని, అందుకే దాన్ని పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పక్కన పెట్టామని ఈ సందర్భంగా ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై నాగేశ్వర్రావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. దివాలా చట్టం కింద సంస్థ దివాలా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఇందులో భాగంగానే ఐఆర్పీగా ఓ అడ్మినిస్ట్రేటర్ నియామకాన్ని కోరుతూ ముంబై ఎన్సీఎల్టీకి ఆర్బీఐ వెళ్లనున్నది. ఇప్పటికే శ్రేయీ గ్రూప్, డీహెచ్ఎఫ్ఎల్పై దివాలా ప్రక్రియల్ని ప్రారంభించిన ఆర్బీఐ.. ఇప్పుడు మరో భారీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ రిలయన్స్ క్యాపిటల్పైనా ఆరంభించనున్నది. సెప్టెంబర్లో జరిగిన సాధారణ వార్షిక సమావేశం వివరాల ప్రకారం రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత రుణ భారం రూ.40వేల కోట్లు. ఈ జూలై-సెప్టెంబర్లో సంస్థ నష్టం రూ.1,156 కోట్లుగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం సంస్థ రూ.9,287 కోట్ల నష్టాల పాలైంది.