కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. అదే జోరును కొనసాగిస్తూ ఈ భామ హిందీలో భారీ అవకాశాన్ని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..రణబీర్కపూర్ హీరోగా అనిల్కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా హిందీలో ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో రణబీర్కపూర్తో జోడీకట్టబోతున్నది రష్మిక మందన్న. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత ఈ సినిమాలో పరిణీతి చోప్రాను నాయికగా ఎంపిక చేశారు. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోగా..ఆ స్థానంలో రష్మిక మందన్నను తీసుకున్నారు. క్రైమ్ డ్రామాగా ‘యానిమల్’ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ పతాకాలపై భూషణ్కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్రెడ్డి వంగా నిర్మించనున్నారు.