అన్ని భాషల్లో తీయాలి: రాకేశ్ టికాయత్
ఆర్ నారాయణమూర్తిపై ప్రశంసల వర్షం
ఈ సమావేశాల్లోనే ఎమ్మెస్పీ చట్టం తేవాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన విప్లవ నటుడు
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అన్నదాతల బాధలను, రైతు ఉద్యమాన్ని కండ్లకు కట్టినట్టు చూపిన ‘రైతన్న’ సినిమా అద్భుతంగా ఉన్నదని రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశంసించారు. ఆయన ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీ లు కేకే, నామా నాగేశ్వర్రావు, బడుగుల లింగయ్య యాదవ్, విప్లవ నటుడు ఆర్ నారాయణమూర్తి తదితరులతో కలిసి ‘రైతన్న’ సినిమాను వీక్షించారు. అనంతరం టికాయత్ మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తికి అభినందనలు తెలిపారు. ఇంత మంచి సినిమాను దేశంలోని అన్ని భాషల్లో తీస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ దిగుబడులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేయాలని ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు.
రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు మానవతా దృక్పథంతో ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్కు సెల్యూట్ చేశారు. ఇంతటి విశాల హృదయం ప్రధాని మోదీకి లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఉద్యమంలో చనిపోయిన రైతులకు సీఎం కేసీఆర్ మాదిరిగా కేంద్రం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఉద్యమ విరమణ సందర్భంగా రైతులు పెట్టిన మూడు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, రైతులపై బనాయించిన కేసులను ఎత్తేయాలని కోరారు. లేనిపక్షంలో మరోసారి రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు.