రాజన్న సిరిసిల్ల, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది. స్వయం ఉపాధి కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నది. ఈమేరకు జిల్లాలో మినీ డెయిరీల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఇందుకు జిల్లావ్యాప్తంగా రూ. 40 కోట్లతో రెండువేల మినీ డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మండలానికి 200 యూనిట్లు ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించింది. రూ. 2లక్షల విలువ గల యూనిట్కు 70శాతం సబ్సిడీ వర్తింపజేస్తున్నది.
రూ. 2 లక్షలకో యూనిట్..
ప్రభుత్వం ఇస్తున్న మినీ డెయిరీ పథకంలో యూనిట్ విలువ రూ. 2లక్షలు ఉంటుంది. అందులో 70 శాతం సబ్సిడీ ఇస్తున్నది. లబ్ధిదారుడు రూ. 60 వేలు కట్టాల్సి ఉంటుంది. ప్రతి యూనిట్కు రెండు బర్రెల చొప్పున పంపిణీ చేస్తారు. ఇలా రెండు వేల మందికి బర్రెలు ఇచ్చి స్వయం ఉపాధిలో రాణించేలా ఎస్సీ కార్పొరేషన్ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న ఆసక్తి గల దళితులకు ఈపథకం వర్తించేలా కార్చాచరణ రూపొందిస్తున్నది. రెండు వేల యూనిట్లకు గానూ ఇప్పటి వరకు 900 వందల మంది దరఖాస్తు చేసుకున్నారు.
మినీ డెయిరీలతో ఉపాధి..
జిల్లాలో పాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం మహిళా సంఘాలకు మంజూరు చేసిన డెయిరీలు విజయవంతంగా నడుస్తున్నాయి. పాల ద్వారా నెయ్యి, పెరుగు, పన్నీరు లాంటి పదార్థాల విక్రయాల ద్వారా మంచి లాభాలు వస్తున్నాయి. ఈమధ్య చాలా మంది డెయిరీ ఫాంలు పెట్టుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళిత కుటుంబాల ఆర్థిక స్వాలంబన కోసం ఈ మినీ డెయిరీలో దోహదపడతాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి మండలాలకు 200 చొప్పున మిగిలిన మండలాల్లో లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
మినీ డెయిరీ ఏర్పాటుకు కనీసం పది గుంటల స్థలం ఉండాలి. ఆధార్, రేషన్, పాన్ కార్డులు తప్పని సరి. నివాస, కులధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకం, వన్బీ ఫాం, లబ్ధిదారులు 21 నుంచి 60 సంవత్సరాలోపు ఉండాలి. అన్ని సర్టిఫికెట్లతో దరఖాస్తులు చేసుకోవాలి. 2014 ముందు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని, పూర్తిగా చెల్లించిన వారు అర్హులు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత యూనిట్ మంజూరు చేస్తారు.
రాష్ర్టానికే ఆదర్శంగా నిలుపుతాం..
దళితుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మినీ డెయిరీ పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. రూ. 40 కోట్లు ఖర్చు చేయనున్నది. మినీ డెయిరీలను ఏర్పాటు చేయడంతో పాటు విజయవంతంగా నిర్వహించి రాష్ర్టానికే ఆదర్శంగా నిలుపుతాం. పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందిన వెంటనే బర్రెలు కొనుగోలు చేసి ఇస్తాం.