హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21వ తేదీన వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నైరుతి రుతు పవనాల ద్రోణి హిమాలయ పర్వత శ్రేణికి చేరువగా కొనసాగుతోందని తెలిపింది.
ఉపరితల ద్రోణి ఒకటి కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల మధ్యలో ఏర్పడిందని పేర్కొంది. తూర్పు-పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపు వంపు తిరిగి ఉందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల జోగులాంబ, నాగర్కర్నూల్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.