కొచ్చి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ హోదా కోసం పోటీపడే వారి గురించి రాహుల్ గాంధీ ఓ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరు ఒక్క పోస్టులో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాజస్థాన్ సీఎం గెహ్లాట్ పోటీలో నిలబడే ఛాన్సులు ఉన్నాయి. గెహ్లాట్ డబుల్ రోల్ ప్లే చేస్తారా అన్న ప్రశ్నలు ఇతర నేతలు సంధించారు. ఆ అంశంపై ఇవాళ రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఉదయ్పూర్ ఒప్పందం ప్రకారం ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే వర్తిస్తుందని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ అనేది ఓ ఐడియాలజికల్ పోస్టు అని, కొన్ని ఐడియాలకు ప్రతిరూపమని, ఓ నమ్మకమైన వ్యవస్థకు నిదర్శనమి, ఇండియా విజన్కు సంకేతంగా ఆ పోస్టు నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇక అధ్యక్ష పదవి కోసం పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది. మనీశ్ తివారి కూడా కాంగ్రెస్ చీఫ్ పోస్టుకు పోటీపడనున్నట్లు తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్, శశి థరూర్, కమల్నాథ్ ఆ పదవికి పోటీపడనున్నట్లు తెలుస్తోంది.