హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు విడతల్లో నిధులు చెల్లించలేని ప్రభుత్వం, ఇప్పుడు ఏకమొత్తంగా చెల్లిస్తామని చెప్పడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. స్కీమ్కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో-9 విడుదల చేసిన విషయం తె లిసిందే. దీని ప్రకారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 75రోజుల్లోనే నిధులు వారి ఖాతాల్లో జమచేస్తామని తెలిపింది. 2008 నుంచి అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి నిధులను కాలేజీ యాజమాన్యాలకే నేరుగా ప్రభుత్వం చెల్లించేది.
కాలేజీ ప్రారంభంలో 25శాతం, విద్యాసంవత్స రం మధ్యలో 50 శాతం, చివర మిగిలిన 25శాతం నిధులను విడుదల చేయాలనేది నిబంధన. మొత్తంగా మూడు విడతల్లో చెల్లించాలి. కానీ, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన నాటి నుంచి ఒక్క రూపాయి చెల్లించలేదు. 2026-27 విద్యా సం వత్సరం నుంచి నిధులను సక్రమంగా చెల్లిస్తామని చెప్పి మార్గదర్శకాలను జారీ చేసింది. స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను ఎంపిక చేసి విద్యార్థుల కు ఒకే విడతలో నిధులిస్తామని చెబుతున్నది. వారు 7 పని దినాల్లోగా కళాశాలకు చెల్లించాలని, లేదంటే రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా తిరిగి వసూలు చేస్తామని పేర్కొన్నది. మూడు విడతల్లో నిధులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం, ఒకే విడతలో చెల్లిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.