తాను పక్కా హైదరాబాదీనని అంటోంది శాన్వీ మేఘన. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి దామోదర దర్శకుడు. గోవర్ధన్రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో శాన్వీ మేఘన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నల్గొండ జిల్లాలోని వింజమూరు నా స్వస్థలం. మా కుటుంబం హైదరాబాద్లో స్ధిరపడటంతో నేను ఇక్కడే పుట్టి పెరిగా. సెయింట్ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశా. ‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’తో హీరోయిన్గా పరిచమయ్యాను. ‘సైరా నరసింహారెడ్డి’లో తమన్నా సోదరిగా నటించా. ‘పిట్టకథలు’ అంథాలజీలో తరుణ్భాస్కర్ దర్శకత్వం వహించిన ‘రాములా’ ఎపిసోడ్ నటిగా నాకు మంచి పేరుతెచ్చిపెట్టింది.
ఆ సిరీస్ వల్లే ‘పుష్పక విమానం’ సినిమాలో అవకాశం వచ్చింది. గత చిత్రాల్లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించా. ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా ఇందులో పట్టణ ప్రాంతానికి చెందిన యువతిగా ఆధునిక ఛాయలున్న పాత్రను పోషించా. లఘు చిత్రాల నటిగా కనిపిస్తా. నటన పట్ల తనకున్న ఇష్టాన్ని నిరూపించుకోవాలని తపన పడే అమ్మాయిగా నా క్యారెక్టర్ విభిన్నంగా సాగుతుంది. తెలంగాణ యాసపై నాకున్న పట్టు సినిమాల్లో ఉపయోగపడింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలో చిన్న పాత్ర కోసం ఆడిషన్కు హాజరయ్యా. ఆ సమయంలో తెలంగాణ యాసలో నేను మాట్లాడటం గమనించిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆ సంభాషణలను సినిమాలో ఉపయోగించారు. నటనపరంగా దివంగత నటి శ్రీదేవి నాకు స్ఫూర్తి. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నా. వెబ్సిరీస్లో అవకాశాలు వస్తున్నాయి’ అని చెప్పింది.