చండీఘఢ్ : చట్టబద్ధ వివాహ వయసు 21 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యువకుడు 18 ఏండ్లు అంతకు పైబడిన వయసున్న యువతి సమ్మతిస్తే వారు దంపతుల వలే కలిసి జీవించవచ్చని పంజాబ్ హర్యానా హైకోర్టు పేర్కొంది. పెండ్లి చేసుకోకుండా యువతీ యువకులు సహజీవనం చేయవచ్చని 2018 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. పంజాబ్ గురుదాస్పూర్ జిల్లాకు చెందిన సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారు కోర్టును ఆశ్రయించారు.
కుటుంబసభ్యులు తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ప్రతి పౌరుడి జీవితం, స్వేచ్ఛను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని, పిటిషనర్కు చట్టబద్ధ వివాహ వయసు లేదని కారణంతో భారత పౌరుడిగా రాజ్యాంగం ప్రసాదించిన పిటిషనర్ హక్కులను నిరాకరించరాదని జస్టిస్ హర్నరేష్ సింగ్ గిల్ పేర్కొన్నారు. తల్లితండ్రులు తమను బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని సహజీవనంలో ఉన్న పిటిషనర్ దంపతుల అభ్యర్ధనను పరిశీలించాలని, దీనిపై తగిన చర్యలు చేపట్టాలని కోర్టు పంజాబ్ పోలీసులను ఆదేశించింది. సహజీవనం చేస్తున్న జంట ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ యువకుడి వయసు చట్టబద్ద వివాహ వయసు 21 ఏండ్ల కంటే తక్కువ కావడం గమనార్హం.