మొహాలీ: ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతూ.. జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల్లోనూ ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటి వరకు ‘ఏ’ కేటగిరీలో ఉన్న ఈ ఇద్దరినీ ఈ ఏడాది కాంట్రాక్ట్లో ‘బి’ కేటగిరీకి పరిమితం చేస్తున్నట్లు బోర్డు అపెక్స్ కౌన్సిల్ బుధవారం వెల్లడించింది.
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లను ‘ఏ+’ (రూ. 7 కోట్లు), ‘ఏ’ (రూ. 5 కోట్లు), ‘బి’ (రూ.3 కోట్లు), ‘సి’ (కోటి రూపాయలు) అనే నాలుగు కేటగిరీలుగా విభజించగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ‘ఏ ప్లస్’లో నిలిచారు. గతేడాది 28 మంది క్రాంట్రాక్ట్ దక్కించుకోగా.. ఇప్పుడా సంఖ్య 27కు పరిమితమైంది. ‘ఏ’ కేటగిరిలో గతంలో పది మంది ఉండగా.. ఇప్పుడు పంత్, రాహుల్, అశ్విన్, జడేజా, షమీ మాత్రమే ఉన్నారు. పుజారా, రహానేతో పాటు ఇషాంత్ శర్మ కూడా గ్రేడ్-‘బి’కి పరిమితం కాగా.. గాయం కారణంగా జట్టులో చోటే కష్టమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రేడ్ ‘సి’కి పడిపోయాడు.
సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ‘సి’ కేటగిరీలోనే ఉండగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ గ్రేడ్ ‘బి’కి ఎగబాకాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ఓపెనర్ శిఖర్ ధవన్ గ్రేడ్- ‘సి’లో ఉండగా.. నిలకడైన ప్రదర్శన కొనసాగించలేకపోతున్న మయాంక్ అగర్వాల్ గ్రేడ్-‘బి’ నుంచి ‘సి’కి చేరాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్న సూర్యుకుమార్ యాదవ్ ‘సి’ కేటగిరిలో చోటు దక్కించుకున్నాడు. ఇక గతేడాది గ్రేడ్-‘సి’లో ఉన్న కుల్దీప్ యాదవ్, నవ్దీప్ సైనీకి ఈసారి చుక్కెదురైంది.
ఇక మహిళల క్రికెట్లో స్మృతి మందన, హర్మన్ప్రీత్కౌర్, పూనమ్ యాదవ్తో పాటు కొత్తగా దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్కు గ్రూప్-‘ఏ’ (రూ. 50 లక్షలు)లో చోటు దక్కింది. సీనియర్ ప్లేయర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామి గ్రూప్-‘బి’ (రూ. 30 లక్షలు) కొనసాగుతుండగా.. యంగ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ‘బి’ నుంచి ‘సి’ (రూ.10 లక్షలు) కేటగిరీకి పరిమితమైంది.
వైజాగ్లో టీ20
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ వేదికలను ఎంపిక చేసింది. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ అనంతరం జూన్లో జరుగనున్న ఈ సిరీస్కు కటక్, విశాఖపట్నం, ఢిల్లీ, రాజ్కోట్, చెన్నై ఆతిథ్యమివ్వనున్నాయి. దేశవాళీ మహిళల టీ20 టోర్నీని వచ్చే నెల 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన బోర్డు మార్చి 15 నుంచి సీకే నాయుడు ట్రోఫీకి పచ్చజెండా ఊపింది.