మెదక్ రూరల్, నవంబర్ 24 : అంగన్వాడీ టీచర్ల ఉద్యోగోన్నతులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న అంగన్వాడీ టీచర్ల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు మూడుసార్లు వేతనం పెంచిన సీఎం కేసీఆర్, ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించారు. ఆ మేరకు సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రమోషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే దిశగా మహిళా, శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. మెదక్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో మెదక్లో ఎనిమిది, రామాయంపేటలో ఏడు, నర్సాపూర్లో ఏడు, అల్లాదుర్గంలో మూడు, మొత్తం 25 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు ఇవి..
పదో తరగతి పాసై, ఉద్యోగం పొంది పదేండ్ల సీనియార్టీ కలిగి ఉండడంతో పాటు 50 ఏండ్లలోపు ఉన్న ప్రధాన, మినీ అంగన్వాడీ టీచర్లు గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు అర్హులు. ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్షతో ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుకు అంగన్వాడీ టీచర్లతోపాటు ఐసీడీఎస్లో కాంట్రాక్టుపై పని చేస్తున్న సూపర్వైజర్లు, ఇన్స్ట్రక్టర్లు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. రాత పరీక్ష తేదీని ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ప్రకటిస్తారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
సూపర్వైజర్ పోస్టులను ప్రభు త్వం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తున్నది. ఇందుకు అర్హులైన వారు ఈ నెల 27వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా మార్కులను బట్టి ప్రమోషన్లు ఉంటాయి. ఇందులో ఎలాంటి పైరవీలకు తావు లేదు. పారదర్శకంగా ప్రమోషన్లు జరుగుతాయి.