Supreme Court | సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సాధారణంగా సినిమా టికెట్ ధరలు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనల వలన సినిమా నిర్మాణం, విడుదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత పద్ధతిలోనే టికెట్ ధరల పెంపు ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో త్వరలో విడుదల కాబోయే భారీ బడ్జెట్ చిత్రం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు మార్గం సుగమమైంది.