పీర్జాదిగూడ : ప్రముఖ సామాజిక వేత్త, విశ్లేషకురాలు, తెలంగాణ మహిళా హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ముక్తాల కళారేఖ(42) శుక్రవారం రాత్రి గుండెపోటులో మృతి చెందారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్లో ఉంటున్న ముక్తాల కళారేఖ శుక్రవారం కరీంనగర్లో తెలిసిన వారి ఇంట్లో బసచేశారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆయాసం రావడంతో సమీప దవాఖానకు తలిస్తుండగా మృతిచెందారు. శనివారం పీర్జాదిగూడలోని ఆమె నివాసానికి మృతదేహాన్ని తరలించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ప్రైవేట్ ఉద్యోగి, వరంగల్ జిల్లా ములకల పల్లి ప్రాంతానికి చెందిన రేఖ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనేక సామాజిక ఉద్యమాలతో పాటు, హేతువాద ఉద్యమాలలో పాల్గొన్నారు. రేఖ మరణించారన్న సమాచారాన్ని తెలుసుకున్న ప్రముఖ గాయని విమలక్క, తెలంగాణ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజులతో పాటు అనేక మంది సామాజిక వేత్తలు హాజరై తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. మహిళా సమస్యలపై అనేక విశ్లేషాత్మకమైన చర్చల్లో పాల్గొని హక్కుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి అని వారు ఆమె సేవలను కొనియాడారు.