వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 14: వ్యవసాయ రంగం భవిషత్తులో మరింత కీలక పాత్ర పోషించనుందని, అందుకు అనుగుణంగా మన వంతుగా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ప్రొ. జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డా.ప్రవీణ్ రావు అన్నారు. ఇటీవల ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డు అందుకున్న ఆయనను మంగళవారం వ్యవసాయ కళాశాల ఆడిటోరియం భవనంలో వ్యవసాయ కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వృత్తిలో మనం రాణిస్తుండటం వరంగా భావించాలన్నారు. సమాజంలో ఎక్కువ అవసరం, ఇష్టపడే రంగంలో మనమున్నామని గుర్తుచేశారు. మనం అవిరళ కృషి చేస్తే మంచి గుర్తింపు, గౌరవం వస్తుందని, మీరు చేసే పనిలో మరింత గౌరవం పొందేలా పని చేయాలని సూచించారు. భవిషత్లో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత తప్పదని ఆయన అన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలతో కూడిన సాంకేతిక విప్లవం రానుందన్నారు. ప్రస్తుతం పోషకాహార భద్రత అత్యంత ప్రాధాన్యత అంశమని ఆయన తెలిపారు.