‘కథ విన్న రోజు నుండే సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. ట్రెండ్సెట్టర్గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు మిర్యాల రవీందర్రెడ్డి. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘అఖండ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. నేడు తన జన్మదినం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు.
2018లో బోయపాటి శ్రీను ఈ కథ వినిపించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిసీన్ చెప్పారు. కాంబినేషన్ పట్ల ఉన్న ధైర్యంతో ఎంత బడ్జెట్లో సినిమా చేయగలమో, ఏ స్థాయి వసూళ్లు వస్తాయో ముందుగానే అంచనా వేసుకున్నాం. అవన్నీ నిజమయ్యాయి. సినిమా ట్రెండ్సెట్టర్గా నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బయ్యర్లు అందరూ లాభాల బాటపట్టారు. నైజాంలో బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రమిది. ఇప్పటివరకు పద్దెనిమిది కోట్లకుపైగా షేర్ వచ్చింది. ఆంధ్రా, సీడెడ్, ఓవర్సీస్లోనూ వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తున్నది. గతంలో దాసరినారాయణరావు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి అగ్ర దర్శకులు.. కథారచయితల సహకారంతో ఒకే ఏడాది పలు సినిమాల్ని తీసిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు కథ, సంభాషణల నుంచి పలు విభాగాల బాధ్యతల్ని దర్శకులే చేపట్టవలసి వస్తున్నది. వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వరుసగా హ్యాట్రిక్ సక్సెస్లను అందుకోవడం బోయపాటి శ్రీనుకే సాధ్యమైంది.
త్వరలో పరిష్కారం
యాక్షన్, ఎమోషన్స్తో పాటు బాలకృష్ణ అభిమానులు ఆశించే అన్ని హంగులు సమపాళ్లలో కుదిరాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను విజువల్ వండర్లా తీర్చిదిద్దారు. అఘోరా పాత్రతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. స్టార్హీరోలా కాకుండా అందరితో కలివిడిగా ఉంటారు బాలకృష్ణ. నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు గౌరవమిస్తుంటారు. ఎంతటి క్లిష్టమైన సన్నివేశాన్నైనా సింగిల్టేక్లోనే పూర్తిచేస్తారు. మా బ్యానర్లో మార్చిలో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాం. ఈ చిత్రం ద్వారా నూతన హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాం. స్టార్హీరోతో ఓ ప్రాజెక్ట్ ఉంటుంది. మరో చిన్న చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నా. ‘అఖండ’హిందీ రీమేక్ రైట్స్ కోసం పలు నిర్మాణ సంస్థలు నన్ను సంప్రదిస్తున్నాయి.ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. టికెట్ రేట్ల సమస్యలపై సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని అనుకుంటున్నా.