Poonam Kaur | టాలీవుడ్లో తనదైన స్టైల్తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి పూనమ్ కౌర్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినిమాల కంటే ఎక్కువగా సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఉండే పూనమ్, తాజాగా ‘ధురంధర్ 2’ సినిమా నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “జస్క్రిత్ సింగ్ రంగీ.. ది రియల్ సింగ్, స్టోరీ ఆఫ్ రియల్ హీరో.. ధురంధర్ 2 చూడటానికి నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను” అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఆమె చివర్లో చేసిన “ఏ ఫేక్ సింగ్ కూడా ఈ బాక్సాఫీస్ ముందు నిలబడలేదు” అనే వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.
పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందనేది స్పష్టంగా చెప్పకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిక్కు గెటప్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ చేసిన ‘ఫేక్ సింగ్’ వ్యాఖ్యలు ఆయనను లక్ష్యంగా చేసుకున్నవేనని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్ సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ ఆ గెటప్పై విమర్శలు చేస్తూ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే, ఆమె ఎక్కడా నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసినట్లు కనిపిస్తోంది.
ఇక పూనమ్ కౌర్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె 2006లో ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనంతరం ‘శౌర్యం’, ‘వినాయకుడు’, ‘నాగవల్లి’, ‘గగనం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘శౌర్యం’ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ కూడా దక్కింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు పూనమ్ కౌర్. తాజా వివాదం కూడా ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.