హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఈ విద్యా సంవత్సరంలో 75,669 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 120 కళాశాలల్లో 24,401 సీట్లు భర్తీ చేసినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ ఏడాది 4,653 సీట్లు మిగిలాయని చెప్పారు. 52 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 54 ప్రభుత్వ కళాశాలల్లో 11,874 సీట్లకు గాను 11,624 కేటాయించామని, 65 ప్రైవేటు కళాశాలల్లో 16,950 సీట్లకు గాను 12,550 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. తుది విడుతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, సెప్టెంబర్ ఒకటి నాటికి కళాశాలల్లో చేరాలని సూచించారు. ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్ క్లాస్లు జరుగుతాయని, 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు కమిషనర్ వివరించారు.