హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు, కార్పొరేట్ కార్యాలయాలు సమకూర్చుతానని నమ్మబలికి రూ.కోట్లలో మోసాలకు పాల్పడిన సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. శ్రీధర్రావుపై రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవడంతో గత 15 రోజుల నుంచి ఆయన పత్తా లేకుండా పోయాడు. దీంతో ఆయన ఆచూకీ తెలిపినవారికి నగదు రివార్డు ఇస్తామని సనత్నగర్ పోలీసులు మంగళవారం ప్రకటించారు. సనత్నగర్లోని ఓ జిమ్ కోచ్తో బలవంతంగా అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్టు శ్రీధర్రావుపై ఫిర్యాదు రావడంతో తాజాగా మరో కేసు నమోదైంది. దీనిపై విచారించేందుకు పోలీసులు జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో శ్రీధర్రావు ఇంటికి వెళ్లగా.. ఆయన అక్కడ లేడు. శ్రీధర్రావు ఫోన్ను స్విచ్చాఫ్ చేసినట్టు పోలీసులకు సమాచారం వస్తుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీధర్రావు ఆచూకీ చెప్పినవారికి నగదు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఎవరికైనా ఆయన జాడ తెలిస్తే వెంటనే 040-27852968, 9490617132 నంబర్లకు సమాచారం అందించాలని సనత్నగర్ ఇన్స్పెక్టర్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.