సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): ఒకే రోజు ఆరు స్నాచింగ్లకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన గొలుసు దొంగ ఎట్టకేటకు అహ్మదాబాద్లో చిక్కాడు. రంగలోకి దిగిన ట్రై పోలీస్ కమిషనరేట్ బృందాలు అహ్మదాబాద్కు చెందిన ఉమేశ్గా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బైక్ చోరీ దగ్గర నుంచి రివర్స్ ఇన్వెస్టిగేషన్..
స్నాచర్ వాడిన ద్విచక్ర వాహనం అసిఫ్నగర్లో చోరీకి గురైనట్లు గుర్తించిన సైబరాబాద్ పోలీసులు అక్కడి నుంచి రివర్స్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. స్నాచర్ ఉమేశ్ వచ్చిన మార్గంలో ఆరా తీయగా.. ముందుగా నాంపల్లిలోని మెజిస్టిక్ లాడ్జిలో దిగినట్లు తేల్చారు. లాడ్జి నుంచి ఉమేశ్ 19వ తేదీన ప్రయాణించిన రూట్ను జల్లెడ పట్టారు. దీంతో మరిన్ని ఆదారాలు లభించాయి.
మేడిపల్లి నుంచి నాంపల్లికి..
ఈ నెల 19వ తేదీన పేట్బషీరాబాద్లో ప్రారంభమైన స్నాచింగ్ల పర్వం మేడిపల్లిలో ముగిసింది.
ఉ. 11.30 నుంచి సా.5 గంటల వరకు స్నాచర్ దాదాపు 22 కిలోమీటర్లు తిరిగాడు. మేడిపల్లిలో బైక్ను వదిలేశాడు. అక్కడే స్నాచింగ్ సమయంలో ధరించిన టోపీ, మాస్క్, జాకెట్ను కూడా వదిలేశాడు. అనంతరం మేడిపల్లి నుంచి బస్సులో ఉప్పల్కు వచ్చాడు. ఉప్పల్ నుంచి ఆటోలో నాంపల్లిలోని లాడ్జికి వెళ్లాడు. అక్కడి నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని.. రైలులో అహ్మదాబాద్కు వెళ్లిపోయినట్లు గుర్తించారు. అయితే జాకెట్ను పరిశీలించిన పోలీసులు దానిపై ఉన్న బ్రాండ్తో నిందితుడు అంతర్రాష్టానికి చెందిన వాడిగా గుర్తించారు.
అహ్మదాబాద్ నుంచి పరార్.. హైదరాబాద్లో స్నాచింగ్
స్నాచర్ ఉమేశ్పై అహ్మదాబాద్లో రెండు స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అక్కడి పోలీసుల కస్టడీలోకి తీసుకోగా.. పోలీసులు డ్యూటీ షిఫ్టు మారే సమయంలో గదిని ఊడ్చేందుకు వచ్చానని చెప్పి పరారై హైదరాబాద్ చేరుకున్నాడు. దీంతో అక్కడి పోలీసులకు కూడా ఉమేశ్ వాంటెడ్గా ఉన్నాడు. ప్రస్తుతం ఉమేశ్ అహ్మదాబాద్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.