మణికొండ, అక్టోబర్ 31: హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ఓ ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్లో బర్త్ డే పార్టీ పేరిట నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి ఎస్వోటీ, నార్సింగి పోలీసులు దాడిచేశారు. 24 మందిని అరెస్టు చేశారు. 22 కార్లతోపాటు రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్నవారిలో యువ హీరోలు, హైదరాబాద్తోపాటు కడప, కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. నగరానికి చెందిన సుమన్ చౌదరి రెండు రోజులుగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. గతంలోనూ సుమన్ చాలాసార్లు ఇదే ఫాంహౌస్లో పేకాట స్థావరాలు ఏర్పాటుచేసినట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.