హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న పిట్టీ ఇంజినీరింగ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.12.95 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10.09 కోట్ల లాభంతో పోలిస్తే 28 శాతం వృద్ధిని కనబరిచింది. అటు ఆదాయం రూ.134.95 కోట్ల నుంచి రూ.242.23 కోట్లకు చేరుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.417. 60 కోట్ల ఆదాయంపై రూ.20.36 కోట్ల లాభాన్ని గడించింది. మరోవైపు, రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 40 పైసలు లేదా 8 శాతం రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.934 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. అలాగే వచ్చే మూడేండ్లలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.270 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ సామర్థ్యం రెండింతలు కానున్నది.